NEET PG exam : నీట్ పీజీ-2024 (NEET PG-2024) పరీక్షల కొత్త షెడ్యూల్ విడుదలైంది. ఇప్పటికే జరగాల్సిన పరీక్ష.. నీట్ యూజీ-2024 (NEET UG-2024) వివాదం కారణంగా వాయిదాపడింది. దాంతో ఇప్పుడు రీషెడ్యూల్ చేసి కొత్త తేదీని ప్రకటించారు. ఒకే రోజు రెండు షిఫ్టుల్లో పరీక్షను నిర్వహించనున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా వైద్యవిద్యలో ప్రవేశాల కోసం ఏటా నిర్వహించే నీట్ యూజీ పరీక్ష ఈసారి అత్యంత వివాదాస్పదమైంది.
ఎన్నడూ లేనంతగా పేపర్ లీక్ వివాదాలు తలెత్తడం, సీబీఐ రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించడం, అరెస్టులు చోటు చేసుకోవడంతో ఈ ప్రభావం నీట్ పీజీ పరీక్షపైనా పడింది. దాంతో గత నెల 23న జరగాల్సిన నీట్ పీజీ పరీక్ష వాయిదా పడింది. ఈ పరీక్షను రీషెడ్యూల్ చేసి నిర్వహించేందుకు కేంద్రం ఇప్పుడు సిద్ధమైంది. ఆ మేరకు తేదీని ప్రకటించింది. ఈ నెల 11న రెండు షిఫ్టుల్లో పరీక్షను నిర్వహించనున్నట్లు వెల్లడించింది.
పోస్ట్గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా నీట్-పీజీ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈసారి నీట్ యూజీ వివాదాల కారణంగా వాయిదా పడింది. పలు జాగ్రత్తలతో పరీక్ష నిర్వహణకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. లీకుల ఆరోపణల నేపథ్యంలో నీట్ పీజీ పరీక్ష ప్రశ్నాపత్రాన్ని పరీక్షకు కేవలం రెండు గంటల ముందు మాత్రమే తయారు చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది.
ఇప్పటికే నీట్ యూజీ పరీక్షలో లీకుల వ్యవహారంపై వచ్చిన ఫిర్యాదులపై విచారణకు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కమిటీని నియమించారు. అలాగే నీట్ రీ టెస్ట్ కూడా రద్దయింది. దీన్ని జూలై 25-27 తేదీల్లో నిర్వహించేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే నీట్పై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కేంద్రం ఈసారి వేసే ప్రతీ అడుగూ జాగ్రత్తగా వేయాల్సిన పరిస్ధితి ఉంది. తేడా వచ్చినా మొత్తం ఉమ్మడి ప్రవేశ పరీక్షల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారే ప్రమాదం ఉంది.
NEET PG 2024 will be conducted on 11th August in two shifts pic.twitter.com/y2nAvDurPD
— ANI (@ANI) July 5, 2024