NEET UG | పాట్నా, జూన్ 20: బీహార్లో నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీకి సంబంధించి కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో అరెస్టయిన నలుగురు నిందితులు పరీక్షకు ముందు రోజు రాత్రి పేపర్ లీక్ అయ్యిందని అంగీకరించారు. ఈ కేసులో బీహార్ పోలీసులు అనురాగ్ యాదవ్ అనే విద్యార్థిని, దానాపూర్ మున్సిపల్ కౌన్సిల్లో జూనియర్ ఇంజినీర్గా పని చేస్తున్న అతడి మామ సికందర్ ప్రసాద్ యదువేందు, నితీశ్ కుమార్, అమిత్ ఆనంద్ అరెస్టు అయ్యారు.
పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలాల్లో వీరు కీలక విషయాలు వెల్లడించారు. పరీక్షకు ముందురోజు ప్రశ్నాపత్రం అందిందని, అందులోని ప్రశ్నలే తెల్లవారి పరీక్షలో అడిగినట్టు అంగీకరించారు. నీట్కు సిద్ధమవుతున్న తనను తన మామ సికందర్ పేపర్ లీకేజీ గురించి చెప్పి ఇంటికి పిలిచారని చెప్పాడు. ముందురోజు రాత్రి తనకు ప్రశ్నాపత్రం ఇచ్చారని, వాటికి సమాధానాలను బట్టీ పట్టించారని, అవే ప్రశ్నలు పరీక్షలో వచ్చాయని ఒప్పుకున్నాడు. మరో విద్యార్థి శివనందన్ కుమార్ కూడా ఇదే విషయాన్ని అంగీకరించాడు.
ఏ పోటీ పరీక్ష ప్రశ్నాపత్రం అయినా లీక్ చేస్తామని, ఇందుకు ఒక్కో విద్యార్థికి రూ.30 – 32 లక్షలు అవుతుందని తనకు నితీశ్ కుమార్, అమిత్ ఆనంద్ చెప్పారని సికందర్ తన వాంగ్మూలంలో తెలిపాడు. తాను నలుగురు విద్యార్థులను రూ.40 లక్షల చొప్పున అడిగానని, జూన్ 4 రాత్రి వారిని వెంటబెట్టుకొని వెళ్లగా నితీశ్, అమిత్ పేపర్ ఇచ్చారని ఒప్పుకున్నాడు. మరునాడు వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులకు విద్యార్థుల అడ్మిట్ కార్డులతో తాను పట్టుబడినట్టు చెప్పాడు. అభిషేక్ అనే విద్యార్థి తండ్రి అవదేశ్.. తాను ప్రశ్నాపత్రం కోసం సికందర్కు రూ.40 లక్షలు ఇచ్చినట్టు ఒప్పుకోగా, ఇచ్చేందుకు అంగీకరించినట్టు ఆయుష్ రాజ్ అనే విద్యార్థి తండ్రి అఖిలేశ్ వాంగ్మూలం ఇచ్చాడు.