Rahul Gandhi | నీట్ అంశంపై లోక్సభలో బుధవారం చర్చించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మంగళవారం లేఖ రాశారు. విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా నీట్ అంశంపై చర్చించాలన్నారు. 24లక్షల మంది నీట్ అభ్యర్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నిర్మాణాత్మకంగా వ్యవరించడమే తమ లక్ష్యమని లేఖలో పేర్కొన్నారు. ఈ చర్చకు ప్రధాని నాయకత్వం వహించడం సముచితమని తాను నమ్ముతున్నాన్నారు. జూన్ 28న పార్లమెంట్ ఉభయ సభల్లో ఈ అంశంపై చర్చకు ప్రతిపక్షాలు కోరగా.. తిరస్కరించిన విషయం తెలిసిందే. అంశంపై మరోసారి చర్చించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ అంశంపై చర్చిస్తామని లోక్సభ స్పీకర్ ప్రతిపక్షాలకు హామీ ఇచ్చారన్నారు.
తమ ఏకైక ఆందోళన దేశంలోని సుమారు 24లక్షల మంది నీట్ అభ్యర్థులు క్షేమమని.. లక్షల కుటుంబాల తమ పిల్లల పోషణ కోసం వ్యక్తిగత త్యాగాలు చేశాయన్నారు. నీట్ పేపర్ లీక్ అనేది ఎంతో మంది అభ్యర్థుల చిరకాల స్వప్నానికి ద్రోహం చేయడమేనన్నారు. సమస్య పరిష్కారానికి ప్రజాప్రతినిధులు ధైర్యంగా నిర్ణయాత్మకమైన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, వారి కుటుంబాలు ఆశిస్తున్నాయన్నారు. గత ఏడేళ్లలో 70పైగా పేపర్లు లీక్ అయ్యాయని, దీంతో 2 కోట్ల మంది విద్యార్థులపై ప్రభావం పడిందని లేఖలో రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇక సోమవారం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా లోక్సభలో రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. నీట్ పేపర్ లీక్తో సహా అన్ని అంశాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ విషయం తెలిసిందే.