NEET | దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష నీట్ యూజీ 2024 (NEET-UG 2024) పరీక్షల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. నీట్ ఫలితాల్లో 1,563 మంది అభ్యర్థులకు ఇచ్చిన గ్రేస్ మార్కులను (Grace Marks) తొలగిస్తామని సుప్రీంకోర్టుకు తెలియజేసింది. వారికి మళ్లీ పరీక్ష రాసే అవకావం కల్పిస్తామని తెలిపింది.
ఈ ఏడాది జరిగిన నీట్ పరీక్షలో 1563 మంది విద్యార్థులకు అదనంగా గ్రేస్ మార్కులు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై విద్యార్థి సంఘాలు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశాయి. నీట్ పరీక్ష నిర్వహణ, ఫలితాల్లో అవకతవకలపై సీబీఐచే విచారణ జరిపించాలని డిమాండ్ చేశాయి. హరియాణాలోని ఒకే పరీక్ష కేంద్రం నుంచి 67 మంది విద్యార్థులు 1వ ర్యాంకు సాధించారని, ఇది అవకతవకలు జరిగిందనడానికి నిదర్శనమని పేర్కొన్నాయి. అయితే, NCERT పాఠ్యపుస్తకాల్లో మార్పులు, పరీక్షా కేంద్రాల వద్ద సమయం కోల్పోవడంతో ఇచ్చిన గ్రేస్ మార్కుల వల్లే పలువురు విద్యార్థులు అధికంగా మార్కులు సాధించడానికి కారణాలని ఎన్టీయే డీజీ సుబోధ్కుమార్ స్పష్టం చేశారు. మరోవైపు అవకతవకల ఆరోపణలపై స్పందించి కేంద్ర విద్యాశాఖ గతవారం నలుగురు సభ్యులతో కూడిన కమిటీని వేసింది. ఈ కమిటి గ్రేస్ మార్కులు పొందిన విద్యార్థులపై విచారణ జరిపి నివేదిక సమర్పించింది. ఈ కమిటీ నిర్ణయాలను కేంద్రం (Centre) గురువారం సుప్రీంకోర్టు (Supreme Court)కు తెలియజేసింది.
‘పరీక్ష సమయంలో కోల్పోయిన సమయం వల్ల గ్రేస్ మార్కులు పొందిన 1563 మంది విద్యార్థుల స్కోర్ కార్డులను రద్దు చేయాలని కమిటీ నిర్ణయించింది. వారికి రీ-టెస్ట్లో పాల్గొనే అవకాశం కల్పిస్తాం. జూన్ 23న పరీక్ష నిర్వహించి ఈ నెల 30వ తేదీలోగా వారి ఫలితాలను ప్రకటిస్తాం. ఆ తర్వాతే కౌన్సెలింగ్ ఉంటుంది. ఒకవేళ మళ్లీ పరీక్ష రాయకూడదని అనుకునే వారు.. గ్రేస్ మార్కులు లేకుండా ఒరిజినల్ మార్కులతో జులై 6 నుంచి ప్రారంభమయ్యే కౌన్సెలింగ్కు వెళ్లొచ్చు’ అని సుప్రీం కోర్టుకు కేంద్రం వెల్లడించింది.
మరోవైపు నీట్ ప్రశ్నపత్రం లీకేజీ ఆరోపణలకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం విచారణ జరిపింది. వెబ్ కౌన్సెలింగ్పై స్టే ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. కౌన్సెలింగ్ యథావిథిగా ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు ఈ పిటిషన్లపై రెండు వారాల్లోగా సమాధానం చెప్పాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)కి నోటీసులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను జులై 8కి వాయిదా వేసింది.
ఈ ఏడాది నీట్ ప్రవేశ పరీక్ష మే 5న దేశవ్యాప్తంగా జరిగిన వదిషయం తెలిసిందే. దాదాపు 24 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. అయితే, 2019 నుంచి ఎన్నడూ లేనివిధంగా ఈసారి ఏకంగా 67 మందికి 720కి 720 మార్కులు రావడం, టాపర్లుగా నిలవడంతో నీట్ పరీక్షలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు మొదలయ్యాయి. ఇప్పటివరకు నీట్ యూజీలో ఒక్కసారి కూడా ముగ్గురికి మించి టాపర్లు లేరు. 2019, 2020లో ఒక్కొక్కరు చొప్పున టాపర్లుగా నిలిచారు. 2021లో ముగ్గురు, 2022లో ఒక్కరు, 2023లో ఇద్దరు టాప్ స్కోరు సాధించారు. కానీ, ఈసారి అసాధారణ రీతిలో 67 మంది టాపర్లుగా నిలవడం, వీరిలో హర్యానాలో ఒకే సెంటర్లో పరీక్ష రాసిన ఆరుగురు ఉన్నారనే వార్తలు రావడం పట్ల విద్యార్థులు, తల్లిదండ్రుల్లో అనుమానాలు మొదలయ్యాయి.
Also Read..
Chandrababu | ప్రజా పాలన ప్రారంభమైంది.. ప్రక్షాళన తిరుమల నుంచే : చంద్రబాబు
School Books | ఆ పాఠ్యపుస్తకాలు వెనక్కి తీసుకోండి.. విద్యాశాఖ ఆదేశాలు