Water | హైదరాబాద్, జూలై 4 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): రాజకీయ పరిణామాలు, పాలకులు తీసుకొనే విధానపరమైన నిర్ణయాలు, అప్పులు, చెల్లిస్తున్న వడ్డీలు.. ఇవన్నీ ఓ దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తాయని ఇప్పటివరకూ తెలుసు. అయితే, నీటి సంక్షోభం కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థే కుప్పకూలే ప్రమాదముంటుందని ఊహించగలమా? అయితే, ఇప్పుడు ప్రస్తుతం దేశంలో అదే పరిస్థితి దాపురించే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారత్లో నీటి లభ్యత అంతకంతకూ పడిపోతున్నది. వాతావరణ మార్పులు, లోటు వర్షపాతం, పట్టణీకరణ, నీటి సంరక్షణలో ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టకపోవడం వెరసి దేశవ్యాప్తంగా కరువు తాండవిస్తున్నది. ఇది ఇలాగే కొనసాగితే దేశ ఆర్థిక వ్యవస్థే చిన్నాభిన్నమయ్యే పరిస్థితి రావొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
దేశంలోని దాదాపు 65 శాతం జనాభా వ్యవసాయం, దాని అనుబంధ రంగాల మీదనే ఆధారపడి జీవిస్తున్నది. దేశ జీడీపీలో సాగురంగం వాటా 20 శాతానికి పైమాటే. వానలు, భూగర్భ జలాలు, నీటి వనరులపై ఆధారపడే వ్యవసాయరంగం పురోగతి సాగిస్తున్నది. అయితే, తీవ్రమైన వేడిగాలులు, రుతుపవనాల గమనంలో మార్పులు, ఎల్నినో ఎఫెక్ట్ వెరసి ఏటా వ్యవసాయానికి సరిపడినంత వర్షపాతం నమోదవ్వట్లేదు. నదులు, కాలువల్లోని నీరు తాగు అవసరాలకే చాలట్లేదు. ఇది నిత్యావసరాల ధరల పెరుగుదలకు కారణమవ్వడమే కాకుండా వ్యవసాయ కూలీల ఉపాధికి గండి పెట్టేదిగా మారింది. ఇక, దేశంలోని 15 ప్రధాన జీవనదుల్లో 11 నదుల్లో నీటి మట్టాలు భారీగా తగ్గిపోయాయి.
గంగ, సభర్ణరేఖ, కృష్ణా, మహీ, తపీ, కావేరీ, పెన్నా, సబర్మతీపై నిర్మించిన పలు జలాశయాలు అడుగంటిపోయాయి. దీంతో తగినంత నీటి సరఫరా లేకపోవడంతో బొగ్గు, స్టీల్, విద్యుదుత్పత్తి కంపెనీలు మూతపడే ప్రమాదం పొంచి ఉన్నది. ఇది ఇలాగే కొనసాగితే.. తయారీ, సేవారంగాలు కోలుకోలేనంత దెబ్బతింటాయి. ఉపాధి కోల్పోయి కుటుంబాలు అప్పుల్లో కూరుకుపోతాయి. సామాజిక అశాంతి పెచ్చరిల్లే ప్రమాదం కూడా ఉన్నది. దేశంలో నెలకొన్న నీటి సంక్షోభంపై ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన చర్యలు చేపట్టాలని సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. కాగా, నీటి కొరత భారత ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం చేకూర్చే ప్రమాదం ఉన్నదని ఇటీవలే మూడీస్ రేటింగ్స్ హెచ్చరించిన విషయం తెలిసిందే.
సాగు, తాగు, పారిశ్రామిక అవసరాలకు తగినంత నీరు ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని గ్రహించి 2014లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ‘మిషన్ కాకతీయ’తో చెరువులు, కుంటల్లో పూడికతీత కార్యక్రమాన్ని పెద్దయెత్తున చేపట్టింది. దీంతో భూగర్భ జలాలు పెరిగాయి. చెరువులు, కుంటలు, సరస్సులు నీటితో తొణికిసలాడి సాగు పండుగైంది. తెలంగాణ దేశానికే ధాన్యాగారమైంది. పారిశ్రామికాభివృద్ధి జరిగింది. ప్రజల ఆదాయమూ గణనీయంగా పెరిగింది. అయితే, ‘మిషన్ కాకతీయ’ స్ఫూర్తితో 2022లో ప్రధాని మోదీ చెరువుల పూడికతీత కార్యక్రమాన్ని ఆర్భాటంగా చేపట్టారు. దేశంలోని 785 జిల్లాల్లో ఒక్కో జిల్లా నుంచి కనీసం 75 సరస్సుల్లో పూడికతీత జరుగాలని ఆదేశించారు. అయితే, ప్రచారంలో చూపిన శ్రద్ధ కార్యాచరణలో జరుగలేదు. ఆ పనులు సవ్యంగా జరిగితే, ప్రస్తుత నీటి సంక్షోభం కొంతైనా తగ్గేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.