Monsoon | నైరుతి రుతుపవనాలు నిర్ణీత సమయానికంటే ముందే దేశవ్యాప్తంగా విస్తరించాయని భారత వాతావరశాఖ వెల్లడించింది. రాజస్థాన్, హర్యానా, పంజాబ్లోని మిగతా ప్రాంతాలను రుతుపవనాలు తాకాయని ఐఎండీ పేర్కొంది. ఇంతకు ముందు జూలై 8 వరకు విస్తరించే అవకాశం ఉందని అంచనా వేసిన ఐఎండీ.. తాజాగా మంగళవారం దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలను రుతుపవనాలు తాకాయని పేర్కొంది. ఈ ఏడాది రుతుపవనాలు సాధారణం కంటే ముందే కేరళ, ఈశాన్య ప్రాంతాలకు విస్తరించిన విషయం తెలిసిందే. మరో వైపు రాబోయే పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ రెడ్, ఆరెంజ్ అలెర్ట్ను జారీ చేసింది. మంగళవారం ఉత్తరాఖండ్, అసోం, మేఘాలయలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
ఆయా జిల్లాలకు ఐఎండీ రెడ్ అలెర్ట్ను ప్రకటించింది. గుజరాత్, అరుణాచల్ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురి సూచనలు ఉన్నాయంటూ ఆరెంజ్ అలెర్ట్ను జారీ చేసింది. 3న దేశ రాజధానితో పాటు పది రాష్ట్రాలకు ఆరెంజ్, ఆంధ్రప్రదేశ్ సహా తొమ్మిది రాష్ట్రాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఆయా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది. 4న ఉత్తరాఖండ్, రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాలకు ఆరెంజ్.. జమ్మూ కశ్మీర్, లడఖ్, హర్యానా, ఢిల్లీకి ఎల్లో అలర్ట్ను ప్రకటించింది. ఇదిలా ఉండగా.. భారత్లో వాతావరణం పరిస్థితులు లా-నినాపై ఆధారపడి ఉంటుందని వాతావరణశాఖ నిపుణులు పేర్కొన్నారు. ఆగస్టు-సెప్టెంబర్లో లా నినా పరిస్థితులు ప్రభావం చూపే అవకాశం ఉంటుందని.. దాంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.