PM Modi : ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్ భవనంలో ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగ్దీప్ ధన్ఖడ్తో భేటీ అయ్యారు. రాజ్యసభ 264వ సమావేశాలు బుధవారం మధ్యాహ్నం ముగిసిన అనంతరం జగ్దీప్ ధన్ఖడ్తో మోదీ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాజ్యసభలో సభా నాయకుడు జేపీ నడ్డా కూడా పాల్గొన్నారు. రాజ్యసభ సమావేశాలు సాగిన తీరుపైనా ఈ సందర్భంగా వారు చర్చించారని సమాచారం.
కాగా, అంతకుముందు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు ప్రధాని నరేంద్ర మోదీ రాజ్యసభలో బదులిచ్చారు.ప్రధాని ప్రసంగానికి విపక్షాలు అడుగడుగునా అడ్డుతగిలాయి. విపక్ష నేత మాట్లాడేందుకు అనుమతించకపోవడాన్ని నిరసిస్తూ సభ్యులు గందరగోళం సృష్టించారు. విపక్ష నేత మాట్లాడేందుకు అనుమతించాలని నినాదాలు చేస్తూ ప్రధాని ప్రసంగానికి అడ్డుతగిలారు.
పాలక పక్ష తీరును నిరసిస్తూ విపక్ష ఎంపీలు నినాదాలు చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. విపక్షాలు ఎగువ సభ ఔన్నత్యాన్ని దిగజారుస్తున్నారని ప్రధాని మోదీ మండిపడ్డారు. సభను విపక్షాలు అవమానించడం తగదని, వారి తీరు మారకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. అసత్యాలను ప్రచారం చేసే వారికి నిజాన్ని వినే ధైర్యం లేదని దేశ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. చర్చల్లో వారు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంటే వినే ధైర్యం వారికి లేకపోయిందని ఎద్దేవా చేశారు.
Read More :
Vande Bharat | ఆగస్టు 15 నుంచి వందే భారత్ స్లీపర్ ట్రెయిన్స్ ట్రయల్ రన్..!