Cholesterol | న్యూఢిల్లీ, జూలై 4: దేశంలో అధిక కొలెస్ట్రాల్(డైస్లిపిడెమియా) ప్రాణాంతకంగా మారుతున్నదని, గుండెజబ్బులకు కారణమవుతున్నదని వైద్య నిపుణులు తరచూ చెప్తుంటారు. అయితే, కొలెస్ట్రాల్ స్థాయిలకు సంబంధించి మాత్రం ఇప్పటివరకు భారత్లో నిర్దిష్టమైన మార్గదర్శకాలు లేవు. 2019లో యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ ఇచ్చిన మార్గదర్శకాలనే భారత్లోనూ వైద్యులు పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం భారత్లో మొదటిసారిగా 22 మంది సభ్యులతో కూడిన కార్డియలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా(సీఎస్ఐ) కొలెస్ట్రాల్ స్థాయిల నిర్వహణకు సంబంధించి మార్గదర్శకాలను జారీ చేసింది.
రక్తంలో చెడు కొలెస్ట్రాల్(ఎల్డీఎల్), ట్రైగ్లిజెరైడ్స్ స్థాయిలు ఎక్కువ ఉండటం, మంచి కొలెస్ట్రాల్(హెచ్డీఎల్) తక్కువగా ఉండటం వల్ల గుండెజబ్బులు, స్ట్రోక్తో పాటు ఇతర అనారోగ్య సమస్యల ముప్పు ఉంటుంది. డైస్లిపెడెమియా ఎలాంటి లక్షణాలు లేకుండా గుండెజబ్బులకు కారణమయ్యే ‘సైలెంట్ కిల్లర్’ అని వైద్య నిపుణులు చెప్తుంటారు. చెక్కెర, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్న ఆహారాలను తినడం వల్ల ఈ సమస్య ఎక్కువగా వస్తుంది. సమతుల ఆహారం, వ్యాయా మం, ఔషధాల ద్వారా కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు.
కేరళ ఉత్తరాది రాష్ర్టాల్లోని ప్రజల్లో ఎల్డీఎల్(చెడు కొలెస్ట్రాల్) స్థాయిలు అధికంగా ఉన్నట్టు గుర్తించారు. తెలంగాణ, రాజస్థాన్, గుజరాత్, మణిపూర్ మినహా దేశంలోని మిగతా అన్ని రాష్ర్టాల ప్రజల్లో హెచ్డీఎల్(మంచి కొలెస్ట్రాల్) స్థాయిలు తక్కువగా ఉన్నట్టు తేలింది.