న్యూఢిల్లీ: ప్రముఖ సామాజిక కార్యకర్త మేధా పాట్కర్కు (Medha Patkar) ఢిల్లీ సాకేత్ కోర్టు ఐదు నెలల సాధారణ జైలు శిక్ష విధించింది. ఆమెపై పరువు నష్టం కేసు వేసిన ప్రస్తుతం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాకు రూ.10 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ రాఘవ్ శర్మ ఈ మేరకు సోమవారం తీర్పు ఇచ్చారు. మేధా పాట్కర్ వయసు రిత్యా సాధారణ శిక్ష విధించినట్లు పేర్కొన్నారు. అయితే ఈ తీర్పుపై అప్పీల్ చేసుకునేందుకు వీలుగా ఆమెకు విధించిన శిక్షను ఆగస్టు 1 వరకు కోర్టు సస్పెండ్ చేసింది.
కాగా, కోర్టు తీర్పుపై మేధా పాట్కర్ స్పందించారు. ‘సత్యం ఎప్పటికీ ఓడిపోదు. ఎవరి పరువు తీయడానికి ప్రయత్నించలేదు. మా పని మాత్రమే చేశాం. కోర్టు తీర్పును సవాల్ చేస్తాం’ అని అన్నారు. 2000లో నర్మదా బచావో ఆందోళనకు వ్యతిరేకంగా, తనపై ప్రకటనలు జారీ చేసిన నాటి అహ్మదాబాద్కు చెందిన ఎన్జీవో సంస్థ నేషనల్ కౌన్సిల్ ఫర్ సివిల్ లిబర్టీస్ చీఫ్గా ఉన్న సక్సేనాపై మేధా పాట్కర్ దావా వేశారు.
మరోవైపు ఒక టీవీ ఛానెల్లో కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన మేధా పాట్కర్ తన పరువుకు నష్టం కలిగించినట్లు సక్సేనా ఆరోపించారు. పరువు నష్టం దావాతో సహా రెండు కేసులను ఆమెపై నమోదు చేశారు. 24 ఏళ్ల పాటు సాగిన పరువు నష్టం కేసులో మేధా పాట్కర్ను దోషిగా కోర్టు నిర్ధారించింది. ఆమెకు 5 నెలలు జైలు శిక్ష విధించింది. అలాగే ప్రస్తుతం ఢిల్లీ ఎల్జీగా ఉన్న సక్సేనాకు రూ.10 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది.