మొరేనా, జూన్ 29: నీట్ లీకేజీ ఉదంతం నేపథ్యంలో బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లోని మొరేనా జిల్లాలో మరో షాకింగ్ ఘటన చోటు చేసుకొన్నది. జీవాజీ యూనివర్సిటీ శనివారం నిర్వహించిన బీఏ, బీఎస్సీ పరీక్షల్లో ఓ కాలేజీ ఎగ్జామ్ సెంటర్లో విద్యార్థుల మాస్ కాపీయింగ్ బయటపడింది. ఉపాధ్యాయుల సమక్షంలోనే కాపీ కొట్టడం సంచలనంగా మారింది.
విద్యార్థులు చిట్టీలతోపాటు ఏకంగా గైడ్బుక్లను పెట్టుకొని కాపీ కొడుతుండటం చూసి ఆశ్చర్యపోవడం తనిఖీకి వచ్చిన తహశీల్దార్ జ్యోతి లక్షకర్ వంతైంది. కేఎస్ హయ్యర్ సెకండరీ స్కూల్లోని ఎగ్జామ్ సెంటర్లో జరిగిన ఈ కాపీయింగ్ వ్యవహారాన్ని ఒకరు కెమెరాలో రికార్డు చేశారు. ఈ కాపీయింగ్ స్కామ్లో ప్రిన్సిపాల్, టీచర్లు, సిబ్బంది భాగస్వామ్యం ఉన్నదని తహశీల్దార్ పేర్కొన్నారు.