పనాజీ: మందు పార్టీ తర్వాత మిగిలిన మద్యం బాటిల్స్ను ఒక వ్యక్తి తీసుకెళ్లాడు. దీనిపై ఆగ్రహించిన స్నేహితుడు అతడ్ని హత్య చేశాడు. (Friend Kills Man) హత్య కేసుపై దర్యాప్తు జరిపిన పోలీసులు చివరకు ఫ్రెండ్ అయిన నిందితుడ్ని అరెస్ట్ చేశారు. గోవాలో ఈ సంఘటన జరిగింది. మంగళవారం అర్థరాత్రి కోర్టాలిమ్ గ్రామంలో నిర్మాణంలో ఉన్న స్థలంలో ఒక వ్యక్తి హత్యకు గురైనట్లు పోలీసులకు సమాచారం అందింది. అక్కడకు చేరుకున్న పోలీసులు మృతుడ్ని 32 ఏళ్ల లియోనెల్ లోబోగా గుర్తించారు. హత్య కేసుపై దర్యాప్తు చేశారు. చివరకు అతడి స్నేహితుడైన 34 ఏళ్ల అలెక్స్ కౌటిన్హోను పోలీసులు అరెస్ట్ చేశారు.
కాగా, నిందితుడ్ని పోలీసులు ప్రశ్నించగా ఫ్రెండ్ను తానే హత్య చేసినట్లు ఒప్పకున్నాడు. గత వారం మందు పార్టీ తర్వాత మిగిలిన మద్యం బాటిల్స్ను స్నేహితుడు తీసుకెళ్లడంతో ఆగ్రహానికి గురైనట్లు తెలిపాడు. మంగళవారం రాత్రి నిర్మాణ స్థలంలో నిద్రిస్తున్న లోబో తలపై సిమెంట్ దిమ్మతో కొట్టి హత్య చేసినట్లు పోలీసులకు చెప్పాడు. అలెక్స్ దుస్తులపై మృతుడి రక్తం మరకలు ఉన్నట్లు ఫోరెన్సిక్ పరీక్ష ద్వారా నిర్ధారించారు. ఈ నేపథ్యంలో జూలై 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త క్రిమినల్ కోడ్ భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) కింద కేసు నమోదు చేసి నిందితుడ్ని అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.