కోల్కతా: ఒక వ్యక్తి తన ప్రియురాలిపై కాల్పులు జరిపాడు. (Man shoots girlfriend) ఆ తర్వాత తనను తాను గన్తో కాల్చుకున్నాడు. ప్రియురాలు బతికిపోగా, ఆ వ్యక్తి మరణించాడు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఈ సంఘటన జరిగింది. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని బడ్జ్ బడ్జ్కు చెందిన రాకేష్ కుమార్ షా, నిక్కు కుమారి దూబే మధ్య ఏడేళ్లుగా పరిచయం ఉంది. బుధవారం కోల్కతాలోని లేక్ గార్డెన్ అతిథి గృహంలో వీరిద్దరూ బస చేశారు. సాయంత్రం 4.30 గంటలకు వారి గదిలో కాల్పుల శబ్దం వినిపించింది. నిక్కు పరుగున బయటకు వచ్చి రిసెప్షన్ వద్దకు వెళ్లింది. రాకేష్ తనపై కాల్పులు జరిపాడని చెప్పింది.
కాగా, ఇంతలో ఆ రూమ్ నుంచి మరోసారి కాల్పుల శబ్దం వినిపించింది. దీంతో సిబ్బంది లోనికి వెళ్లి చూడగా రాకేష్ రక్తపు మడుగులో పడి ఉన్నాడు. బుల్లెట్ గాయమైన నిక్కు కుమారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆమె పొత్తికడుపు, తొడ భాగంలో కాల్పుల గాయాలున్నట్లు డాక్టర్లు తెలిపారు.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రాకేష్ కుమార్, నిక్కు కుమారి సుమారు ఏడేళ్లుగా కలిసి ఉన్నట్లు తెలుసుకున్నారు. అయితే విడిపోదామని నిక్కు అనడంతో ఆగ్రహించిన రాకేష్ ఆమెను చంపాలనుకున్నాడని పోలీసులు తెలిపారు. నిక్కుపై కాల్పులు జరిపిన అతడు తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని చెప్పారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.