Mamata Banerjee : న్యాయవ్యవస్థ సామాన్యులకు రక్షణ కల్పించాలని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతాబెనర్జి అన్నారు. న్యాయవ్యవస్థ నిష్పక్షపాతంగా, నిజాయితీగా, స్వచ్ఛంగా ఉండాలని శనివారం ఆమె న్యాయమూర్తులకు సూచించారు. పశ్చిమ బెంగాల్లో జరిగిన నేషనల్ జ్యుడీషియల్ అకాడమీ ప్రాంతీయ సదస్సులో బెనర్జి ప్రసంగించారు.
‘పశ్చిమ బెంగాల్లో 88 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఉన్నాయి. వాటిలో 55 మహిళలకు మాత్రమే. రాష్ట్రంలో 99 మానవ హక్కుల కోర్టులు ఉన్నాయి. దేశంలోని న్యాయవ్యవస్థ పూర్తిగా నిష్పక్షపాతంగా, స్వచ్ఛంగా, నిజాయితీగా ఉండాలన్నదే నా విజ్ఞప్తి. గోప్యత పాటించాలి.’ అని మమతాబెనర్జి పేర్కొన్నారు. ఈ సదస్సులో భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్, కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్ శివగణనం కూడా ఉన్నారు.
న్యాయశాస్త్రంలో పట్టా పొందిన ముఖ్యమంత్రి మమత.. తాను కూడా న్యాయవాద సభ్యురాలు అని, న్యాయవ్యవస్థ తనకు పవిత్ర దేవాలయం, చర్చి, మసీదు, గురుద్వారా లాంటిదని అన్నారు. తాను చట్టపరమైన సోదరభావంలో భాగమని భావిస్తున్నానని, ఇప్పటికీ బార్ అసోసియేషన్లో సభ్యురాలినని చెప్పారు. తాను కూడా కోర్టులో కొన్ని కేసులు వాదించానని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ న్యాయవ్యవస్థ వెంటే ఉంటుందని, సామాన్య ప్రజలను రక్షించడం న్యాయవ్యవస్థ ప్రథమ బాధ్యతని మమత పేర్కొన్నారు. న్యాయవ్యవస్థను మెరుగుపరచడానికి రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.1,000 కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు. న్యాయవ్యవస్థ సామాన్యులకు రక్షణ కల్పించకపోతే వారిని ఎవరు కాపాడుతారని ప్రశ్నించారు. దేశ న్యాయవ్యవస్థను మెరుగుపరచడంలో జస్టిస్ చంద్రచూడ్ నిస్సందేహంగా సహాయపడ్డారని ఆమె కొనియాడారు.