Mallikarjun Kharge : రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చకు బదులిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తున్న సమయంలో విపక్ష ఎంపీల వాకౌట్ను రాజ్యసభలో విపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ మల్లికార్జున్ ఖర్గే సమర్ధించుకున్నారు. ప్రధాని ప్రసంగంలో కొన్ని తప్పుడు అంశాలను సభకు వెల్లడించినందుకు నిరసనగా తాము వాకౌట్ చేశామని తెలిపారు. అసత్యాలు పలకడం ఆయనకు అలవాటని సత్యదూరమైన అంశాలను ప్రస్తావిస్తుంటారని ఖర్గే ఆరోపించారు.
ప్రధాని రాజ్యాంగం గురించి మాట్లాడుతుంటే మీరు రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తారని తాను పేర్కొన్నానని చెప్పారు. రాజ్యాంగం కోసం పాటుపడేది ఎవరు, దాన్ని వ్యతిరేకించేది ఎవరనేది స్పష్టం చేశానని తెలిపారు. ఆరెస్సెస్ రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తుందని, వారు బీఆర్ అంబేడ్కర్, పండిట్ జవహర్లాల్ నెహ్రూ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారని ఖర్గే అన్నారు. బీఆర్ అంబేడ్కర్ను కాంగ్రెస్ అగౌరవపరుస్తుందని మోదీ పదేపదే చెబుతుంటారని అన్నారు.
రాజ్యాంగ సభలో బాబా సాహెబ్ ఏం చెప్పారో, ఆర్గనైజర్లో ఆరెస్సెస్ ఏం రాసిందో చెప్పాలని తాను భావించానని ఖర్గే తెలిపారు. కాగా, అంతకుముందు రాజ్యసభలో ప్రధాని ప్రసంగానికి విపక్షాలు అడుగడుగునా అడ్డుతగిలాయి. విపక్ష నేత మాట్లాడేందుకు అనుమతించకపోవడాన్ని నిరసిస్తూ సభ్యులు గందరగోళం సృష్టించారు. విపక్ష నేత మాట్లాడేందుకు అనుమతించాలని నినాదాలు చేస్తూ ప్రధాని ప్రసంగానికి అడ్డుతగిలారు. పాలక పక్ష తీరును నిరసిస్తూ విపక్ష ఎంపీలు నినాదాలు చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు.
విపక్షాలు ఎగువ సభ ఔన్నత్యాన్ని దిగజారుస్తున్నారని ప్రధాని మోదీ మండిపడ్డారు. సభను విపక్షాలు అవమానించడం తగదని, వారి తీరు మారకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. అసత్యాలను ప్రచారం చేసే వారికి నిజాన్ని వినే ధైర్యం లేదని దేశ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. చర్చల్లో వారు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంటే వినే ధైర్యం వారికి లేకపోయిందని ఎద్దేవా చేశారు.
Read More :