Jairam Ramesh : రాజ్యసభ విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే సభ వెల్లోకి దూసుకురావడంపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ వివరణ ఇచ్చారు. ఖర్గే వంటి సీనియర్ నేతను మాట్లాడేందుకు ఈరోజు అనుమతించలేదని అన్నారు. పేపర్ లీక్లు, నీట్ వంటి ఘటనలను ముందుగా చర్చకు చేపట్టాలని మాత్రమే తాము కోరామని చెప్పారు. ఖర్గే చేతిని పైకిలేపి చర్చకు పట్టుబట్టినా సభాధ్యక్షుడు పట్టించుకోలేదని అన్నారు.
పదేపదే విజ్ఞప్తి చేసినా విస్మరించడంతో విధిలేని పరిస్ధితుల్లో ఖర్గే వెల్లోకి రావాల్సిన పరిస్ధితి ఎదురైందని పేర్కొన్నారు. విపక్ష నేత ఎన్నడూ వెల్లోకి దూసుకురాలేదని చెబుతున్నారని, జమ్ము కశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దుకు సంబంధించిన బిల్లు చేపట్టినప్పుడు అప్పటి విపక్ష నేత గులాం నబీ ఆజాద్ నిరసనగా వెల్లోకి వచ్చారని గుర్తుచేశారు.
తనను మాట్లాడేందుకు అనుమతించాలని ఇవాళ ఖర్గే రాజ్యసభ ఛైర్మన్ను పదేపదే కోరినా పట్టించుకోలేదని ఆరోపించారు. నాలుగైదు గంటలు నీట్ వ్యవహారంపై చర్చించి విద్యాశాఖ మంత్రి ప్రకటన ఇచ్చిఉంటే సరిపోయేదని కానీ పాలకపక్షం మొండివైఖరితో వ్యవహరించిందని పేర్కొన్నారు. ఖర్గే వెల్లోకి రావాల్సిన పరిస్ధితిని పాలక పక్షమే కల్పించిందని దుయ్యబట్టారు.
మరోవైపు పాతిక లక్షల మంది విద్యార్ధుల భవితవ్యానికి సంబంధించిన నీట్ వ్యవహారంపై చర్చించేందుకు తాము పట్టుబట్టినా ప్రభుత్వం స్పందించలేదని అంతకుముందు రాజ్యసభ విపక్ష నేత ఖర్గే పేర్కొన్నారు. తనను మాట్లాడేందుకు అనుమతించాలని ఎన్నిసార్లు కోరినా రాజ్యసభ ఛైర్మన్ పట్టించుకోకపోవడంతో తాను వెల్లోకి వెళ్లానని ఆయన వివరణ ఇచ్చారు. సభాద్యక్షుడి దృష్టిని ఆకర్షించి నీట్ రగడపై చర్చించాలని తాను ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయిందని పేర్కొన్నారు.
Read More :