బెంగుళూరు: కర్నాటకలో సీఎం(Karnataka CM) కుర్చీపై వివాదం చెలరేగుతున్నది. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ను సీఎం చేయాలని, ఆ పదవిలో ఉన్న సిద్దరామయ్య తప్పుకోవాలని.. ఇవాళ వక్కలింగ వర్గానికి చెందిన ప్రముఖ మఠాధిపతి కుమార చంద్రశేఖరనాథ స్వామి అభిప్రాయపడ్డారు. బెంగుళూరు వ్యవస్తాపకుడు కెంపెగౌడ 515వ జయంతి ఉత్సవాల సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని తెలిపారు. డిప్యూటీ సీఎం శివకుమార్ కూడా వక్కలింగ కులానికి చెందిన వ్యక్తే.
ప్రతి ఒక్కరూ సీఎం అయ్యారని, ఆ అధికారాన్ని అనుభవించారని, కేవలం డీకే శివకుమార్ మాత్రమే సీఎం కాలేదని కుమార చంద్రశేఖరనాథ స్వామి తెలిపారు. అయితే ఒకవేళ సిద్ధరామయ్య తన సీఎం పదవిని వదులుకుంటే, అప్పుడు శివకుమార్ సీఎం అవుతారని మఠాధిపతి పేర్కొన్నారు. సిద్దరామయ్య, శివకుమార్ ఒకే స్టేజ్పై ఉన్న సమయంలో చంద్రశేఖరనాథ స్వామి ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
డీకే శివకుమార్ సీఎం కావాలని చెన్నగిరి కాంగ్రెస్ ఎమ్మెల్యే బసవరాజు శివగంగ కూడా డిమాండ్ చేశారు. సీఎం సిద్ధరామయ్య దీనిపై రియాక్ట్ అవుతూ.. కాంగ్రెస్ హైకమాండ్ ఈ అంశాన్ని చూసుకుంటుందన్నారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామని, హైకమాండ్ ఏది నిర్ణయిస్తే అదే చేస్తామన్నారు.
మరో వైపు ముగ్గురు డిప్యూటీ సీఎంలు ఉండాలని కర్నాటకలో కొన్ని వాదనలు వినిపిస్తన్నాయి. మంత్రులు అందరూ దీనిపై మాట్లాడడం ఆపేయాలని సీఎం సిద్ధరామయ్య తెలిపారు. ఇలాంటి టాపిక్పై ప్రకటనలు చేయవద్దు అని మంత్రి కేఎన్ రాజన్నకు సీఎం సిద్దరామయ్య ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం శివకుమార్ ఒక్కరే డిప్యూటీ సీఎంగా ఉన్నారు. కానీ వీరశైవ లింగాయత్లు, ఎస్సీ-ఎస్టీలు, మైనార్టీలకు కూడా డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని మంత్రి రాజన్న డిమాండ్ చేశారు.
ముగ్గురు డిప్యూటీ సీఎంలు ఉండాలని మీడియాతో మాట్లాడడం సరికాదు అని, కావాలనుకుంటే ఆ నేతలు నేరుగా వెళ్లి హైకమాండ్తో చర్చించుకోవచ్చు అని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెలిపారు.