ప్రయాగ్రాజ్(యూపీ): మతమార్పిళ్ల విషయంలో అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మతమార్పిడి జరిగే మతపరమైన సమ్మేళనాలను వెంటనే ఆపకుంటే దేశంలోని మెజారిటీ జనాభా ఏదో ఒక రోజు మైనారిటీలుగా మారిపోతారని ఆందోళన వ్యక్తంచేసింది.
ఓ గ్రామంలోని పలువురితో మతమార్పిడి చేయించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న కైలాశ్ అనే నిందితుడి బెయిలు పిటిషన్ను తిరస్కరించిన జస్టిస్ రోహిత్ రాజన్ అగర్వాల్ మాట్లాడుతూ ‘ప్రోపగేషన్’ పదానికి ప్రచారం కల్పించడం అని అర్థమే కానీ, ఓ వ్యక్తిని తన మతం నుంచి మరో మతంలోకి మార్చడం కాదని స్పష్టం చేశారు.
ఈ కేసులో కైలాశ్పై తీవ్రమైన ఆరోపణలున్నాయి. మతమార్పిడుల విషయాన్ని బయటపెట్టిన మహిళ, ఆమె సోదరుడితోపాటు గ్రామానికి చెందిన మరికొందరిని న్యూఢిల్లీలో జరిగిన ఓ సమావేశానికి తీసుకెళ్లిన నిందితుడు అక్కడ వారిని క్రైస్తవంలోకి మార్చేశాడు. విషయాన్ని బయటపెట్టిన మహిళ సోదరుడి ఆచూకీ ఇప్పటి వరకు లేదు.