ముంబై: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)కి నేతృత్వం వహిస్తున్న అజిత్ పవార్కు (Ajit Pawar) ఆయన వర్గం నేత షాక్ ఇచ్చారు. పింప్రి-చించ్వాడ్ యూనిట్ చీఫ్ అజిత్ గవానే శనివారం శరద్ పవార్ను కలిశారు. 15 మంది మాజీ కార్పొరేటర్లతో కలిసి పూణెలోని ఆయన నివాసంలో సమావేశమైనట్లు సమాచారం. దీంతో శరద్ పవార్ వర్గంలో ఆయన చేరుతారంటూ ఊహాగానాలు వెల్లువెత్తాయి.
కాగా, శరద్ పవార్ను కలిసినట్లు వస్తున్న వార్తలను అజిత్ గవానే ఖండించారు. అయితే భోసారి నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలన్న కోరికను బహిరంగంగా వ్యక్తం చేశారు. అజిత్ పవార్ టికెట్ నిరాకరిస్తే ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా? లేదా శరద్ పవార్ పార్టీలో చేరతారా? అని మీడియా అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానమిచ్చారు. ‘ఇండిపెండెంట్గా పోటీ చేసే ప్రశ్నే లేదు. నాకు టిక్కెట్ రాకపోతే శరద్ పవార్ పార్టీతో పొత్తు పెట్టుకుంటా’ అని అన్నారు.
మరోవైపు మహారాష్ట్రలో బీజేపీ, సీఎం ఏక్నాథ్ షిండే వర్గం శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీ వర్గం కూటమి ప్రభుత్వం ఉంది. బీజేపీకి చెందిన మహేష్ లాంగే ప్రస్తుతం భోసారి ఎమ్మెల్యేగా ఉన్నారు. దీంతో ఆ సీటు ఎన్సీపీకి వెళ్లే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో ఆ స్థానం నుంచి పోటీ కోసం శరద్ పవార్ వర్గంలో అజిత్ గవానే కలుస్తారన్న ప్రచారం జరుగుతున్నది.