Air India flight | లండన్కు వెళ్లే ఎయిర్ ఇండియా విమానానికి (Air India flight) బాంబు బెదిరింపులు (bomb threat) రావడం కలకలం సృష్టించింది. మంగళవారం తెల్లవారుజామున ఎయిర్ ఇండియాకు చెందిన AI 149 విమానం లండన్ గాట్విక్ వెళ్లేందుకు కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (Cochin airport) రన్వేపై సిద్ధంగా ఉంది. ఆ సమయంలో ఈ విమానంలో బాంబు పెట్టినట్లు కొందరు ఆగంతకులు ముంబైలోని ఎయిర్ ఇండియా కాల్ సెంటర్కు ఫోన్ కాల్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు.
దీంతో అప్రమత్తమైన అధికారులు ఈ సమాచారాన్ని వెంటనే కొచ్చిలోని ఎయిర్ ఇండియా సిబ్బందికి చేరవేశారు. అప్రమత్తమైన ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ, ఎయిర్లైన్ సెక్యూరిటీ అధికారులు విమానంలో విస్త్రృతంగా తనిఖీలు చేపట్టారు. ఇన్లైన్ బ్యాగేజీ స్క్రీనింగ్ సిస్టమ్ ద్వారా భద్రతా తనిఖీలు జరిపారు. అయితే ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలూ కనిపించలేదు. దీంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.
అన్ని తనిఖీలు అనంతరం విమానం లండన్ వెళ్లేందుకు అనుమతించినట్లు కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అధికారి ఒకరు తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన అధికారులు బెదిరింపులకు పాల్పడింది.. అదే విమానంలో లండన్ వెళ్లేందుకు సిద్ధమైన కేరళలోని మలప్పురం జిల్లాకు చెందిన 29 ఏళ్ల సుహైబ్గా గుర్తించారు. సదరు వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు సదరు అధికారి వెల్లడించారు.
Also Read..
Karnataka | కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం.. చికెన్ కబాబ్లో కృత్రిమ రంగు వాడకంపై నిషేధం