Lok Sabha : 18వ లోక్సభ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు ప్రధాని నరేంద్ర మోదీ బదులిచ్చిన అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. జులై 24న ప్రారంభమైన 18వ లోక్సభ తొలి సమావేశాలు వాడివేడిగా సాగాయి. ఈ సమావేశాల్లో నీట్ వివాదం, మణిపూర్ అల్లర్లపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి.
మోదీ సర్కార్ లక్ష్యంగా విపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శలతో విరుచుకుపడ్డారు. రాహుల్ వివాదాస్పద వ్యాఖ్యలను స్పీకర్ ఆదేశాలతో రికార్డుల నుంచి తొలగించినట్టు లోక్సభ సెక్రటేరియట్ ప్రకటించడం పెను దుమారం రేపింది. తన వ్యాఖ్యలను పునరుద్ధరించాలని రాహుల్ గాంధీ లోక్సభ స్పీకర్కు లేఖ రాశారు. మోదీ ప్రభుత్వం విపక్ష నేతలపై ఈడీ, సీబీఐ దాడులతో వేధింపులకు గురిచేస్తోందని రాహుల్ విమర్శించారు.
ఎన్డీయే హయాంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ప్రమాదంలో పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు విపక్షాల విమర్శలను ప్రధాని నరేంద్ర మోదీ తిప్పికొట్టారు. లోక్సభ ఎన్నికల్లో విపక్ష కూటమి అసత్యాలను ప్రచారం చేసినా పరాజయం తప్పలేదని ఎద్దేవా చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ దశాబ్ధంలో భారత్ ఖ్యాతి పెరిగిందని వివరించారు.
రాష్ట్రపతి ప్రసంగంలో వికసిత్ భారత్ లక్ష్యాలను వివరించారని, ఈ దిశగా తమ ప్రస్ధానం సాగుతుందని స్పష్టం చేశారు. నేషన్ ఫస్ట్ అనే నినాదంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. సభలో నిన్న, ఇవాళ రాష్ట్రపతి ప్రసంగంపై పలువురు ఎంపీలు తమ అభిప్రాయాలను వెల్లడించారని, వీరిలో కొందరు తొలిసారి ఎంపీలు అయినవారు కూడా ఉన్నారని తెలిపారు.
నూతన సభ్యుల ప్రమాణం
ఈ సెషన్లో తొలుత నూతనంగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం జరగ్గా, ఆపై ప్రొటెం స్పీకర్గా నియమితులైన బీజేపీ సీనియర్ ఎంపీ భర్తృహరి మహతాబ్ కొత్తగా ఎన్నికైన లోక్సభ సభ్యులతో ప్రమాణం చేయించారు. లోక్సభ నూతన స్పీకర్గా ఓం బిర్లా ఎన్నికయ్యారు. ఇక రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం పార్లమెంటు ఉభయ సభల ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు.
Read More :
IBPS Clerk | ప్రభుత్వరంగ బ్యాంకుల్లో 6128 క్లర్క్ పోస్టులు.. నోటిఫికేషన్ విడుదలచేసిన ఐబీపీఎస్