Assam Floods : అసోంలో వరద తాకిడి కొనసాగుతున్నది. మోరిగావ్ జిల్లాలో వరద బీభత్సానికి వేలాది మంది నిరాశ్రయులయ్యారు. జిల్లాలో ఏకంగా 194 గ్రామాలు నీటమునిగాయని అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది ఒక్కసారిగా ఒక రోజులోనే అనూహ్యంగా వరద నీరు పోటెత్తిందని స్ధానికులు పేర్కొన్నారు. పెద్దసంఖ్యలో ప్రజల ఆస్తులకు నష్టం వాటిల్లింది.
కుండపోతతో నిరాశ్రయులైన వారు తలదాచుకునేందుకు టెంట్లు, షెల్టర్స్ ఏర్పాటు చేశామని చెప్పారు. అధికారులు తాగు నీరు, ఆహారం సరఫరా చేస్తున్నారని తెలిపారు. బ్రహ్మపుత్రకు వరదలు పోటెత్తడం దీర్ఘకాల సమస్యగా మారిందని, దీనిపై అధికారులు దృష్టిసారించి పరిస్ధితి చక్కదిద్దాలని కోరుతున్నారు. బ్రహ్మపుత్ర వరదలతో స్ధానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
కాగా, అసోంలో వరద ఉధృతి కొనసాగుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వరద నీరు పోటెత్తుతోంది. కుండపోతతో పలు గ్రామాలు నీట మునిగాయి. రహదారులు, కమ్యూనికేషన్ల వ్యవస్ధ తీవ్రంగా దెబ్బతింది. ఇక మరిగావ్ జిల్లాలో బ్రహ్మపుత్ర నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలు వరద నీటిలో మునిగిపోయాయి.
వర్షాల కారణంగా అసోంలోని బ్రహ్మపుత్ర నది నీటిమట్టం పెరగడంతో నగాంవ్, డిబ్రుగఢ్ జిల్లాలు నీట మునిగాయి. రహదారులు, ఇండ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందం రంగంలోకి దిగి సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ఇక గాలుల ఉధృతికి భారీ వృక్షాలు సైతం నేలకొరగడంతో పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.