Mallikarjuna Kharge | న్యూఢిల్లీ, జూలై 1: ఆర్ఎస్ఎస్ను ఉద్దేశించి రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు సభలో రచ్చ రాజేశాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సోమవారం జరిగిన చర్చలో ఖర్గే ప్రసంగించారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ అంశాన్ని ఆయన ప్రస్తావిస్తూ.. వీసీలు, ప్రొఫెసర్లుగా తమ సభ్యులను నియమిస్తూ విశ్వవిద్యాలయాలు, ఎన్సీఈఆర్టీ సహా విద్యాసంస్థల్లోకి ఆర్ఎస్ఎస్ చొరబడుతున్నదని ఆరోపించారు. అన్ని సంస్థలను ఒకే సంస్థ గుప్పిట్లో తీసుకుందని, బీజేపీ, ఆర్ఎస్ఎస్ కలిసి దేశంలోని సంస్థలను నాశనం చేశాయని పేర్కొన్నారు.
ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ సభ్యులతో పాటు రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్కర్ కూడా అభ్యంతరం తెలిపారు. ఆర్ఎస్ఎస్ దేశం కోసం అవిశ్రాంతంగా పోరాడుతున్నదని, అందులో ఎంతోమంది మేధావులు ఉన్నారని ధన్కర్ పేర్కొన్నారు. ఖర్గే వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించారు. ఆర్ఎస్ఎస్కు సభ్యుడిగా ఉండటం నేరమా అని ఆయన ఖర్గేను ప్రశ్నించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందిస్తూ.. ఖర్గేకు ఆర్ఎస్ఎస్ గురించి ఏమాత్రం అవగాహన లేదని, ఆ సంస్థ గురించి ఖర్గే మాట్లాడటం విచారకరమని పేర్కొన్నారు.