శ్రీనగర్: అమర్నాథ్ యాత్ర(Amarnath Yatra) ఇవాళ ప్రారంభమైంది. తొలి బ్యాచ్ యాత్రికులు బేస్ క్యాంపు నుంచి ఉదయం బయలుదేరి వెళ్లారు. బల్తాల్, నువాన్ క్యాంపుల నుంచి భక్తులు బోలేనాథుడి దర్శనం కోసం పయనం అయ్యారు. హిమాలయాల్లోని దక్షిణ కశ్మీర్లో సుమారు 3880 మీటర్ల ఎత్తులోని ఓ గుహలో భక్తులు మంచు శివలింగాన్ని దర్శనం చేసుకోనున్నారు. నువాన్-పహల్గామ్ రూట్లో ఉన్న 48 కిలోమీటర్లు, బల్తాల్ రూట్లో ఉన్న 14 కిలోమీటర్ల మార్గంలో భక్తులు వెళ్తున్నారు. ప్రభుత్వ అధికారులు జెండా ఊపి యాత్రికులకు గుడ్లక్ చెప్పారు.
#WATCH | J&K: A large number of pilgrims en route from Baltal to Holy Amarnath cave. pic.twitter.com/u9hdwn7c95
— ANI (@ANI) June 29, 2024
జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా 4603 మంది తొలి బ్యాచ్ యాత్రికులకు భగవతి నగర్ బేస్ క్యాంపు నుంచి జెండా ఊపి పంపారు. కశ్మీర్ వ్యాలీకి మధ్యాహ్నం చేరుకున్న ఆ భక్తులకు స్థానికంగా స్వాగతం లభించింది. యాత్రను సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాటు చేశారు. భారీ స్థాయిలో భద్రతను పెంచారు.
కశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్, ఐటీబీటీ, పారామిలిటరీ దళాలు పహారా కాస్తున్నాయి. ఏరియల్ సర్వే కూడా నిర్వహిస్తున్నారు. ఆగస్టు 19వ తేదీన అమర్నాథ్ యాత్ర ముగుస్తుంది.