KC Venugopal : ఎన్డీయే హయాంలో చేపట్టిన ప్రతిష్టాత్మక నిర్మాణాలన్నీ కూలిపోయే ప్రమాదంలో ఉన్నాయని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ ఆందోళన వ్యక్తం చేశారు. లోక్సభలో మంగళవారం ఆయన మాట్లాడుతూ ఢిల్లీ విమానాశ్రయం పైకప్పు కూలిందని, జబల్పూర్ ఎయిర్పోర్ట్ రూఫ్ కూలిందని, రాజ్కోట్ ఎయిర్పోర్ట్ కనోపీ ధ్వంసమైందని వివరించారు. అయోధ్యలో రహదారుల పరిస్ధితి దారుణంగా ఉందని, రామ్ మందిర్లో లీకేజీలు, ముంబై హార్బర్ లింక్ రోడ్డులో పగుళ్లు చోటుచేసుకున్నాయని చెప్పారు.
బిహార్లో మూడు వంతెనలు కుప్పకూలగా, ప్రగతి మైదాన్ టన్నెల్ నీటి మునిగిందని తెలిపారు.ఈ నిర్మాణాలన్నీ ఎన్డీయే హయాంలో చేపట్టినవేనని వెల్లడించారు. వారి పాలనలో ప్రతి భవనం కూలిపోయే ముప్పు కలిగిఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో అతిపెద్ద కుంభకోణం ఎన్నికల బాండ్ల స్కామ్ అని, ఎన్నికల బాండ్ల వ్యవహారంపై విచారణ జరిపించాలని కేసీ వేణుగోపాల్ ప్రధాని నరేంద్ర మోదీకి సవాల్ విసిరారు.
మరోవైపు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో తన ప్రసంగంలోని కొన్ని వ్యాఖ్యలను ప్రభుత్వం రికార్డుల నుంచి తొలగించడంపై విపక్ష నేత రాహుల్ గాంధీ విస్మయం వ్యక్తం చేశారు. ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి విఘాతమని స్పీకర్ ఓం బిర్లాకు రాసిన లేఖలో రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు. రికార్డుల నుంచి తొలగించిన వ్యాఖ్యలను పునరుద్ధరించాలని స్పీకర్కు రాసిన లేఖలో ఆయన విజ్ఞప్తి చేశారు.
కాగా, రాహుల్ ప్రసంగంలోని కొన్ని వ్యాఖ్యలను పార్లమెంట్ రికార్డుల నుంచి తొలగించారు. ఈ మేరకు లోక్సభ సెక్రటేరియట్ తాజాగా వెల్లడించింది. స్పీకర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. హిందువులు, ప్రధాని మోదీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్, అగ్నివీర్, నీట్ పరీక్షల్లో అక్రమాలపై రాహుల్ చేసిన వ్యాఖ్యలను తొలగించినట్లు వివరించింది.
Read More :
IBPS Clerk | ప్రభుత్వరంగ బ్యాంకుల్లో 6128 క్లర్క్ పోస్టులు.. నోటిఫికేషన్ విడుదలచేసిన ఐబీపీఎస్