Hathras Stampade : యూపీలోని హథ్రాస్ తొక్కిసలాటలో మృతులు, బాధితుల కుటుంబాలను పరామర్శించేందుకు విపక్ష నేత రాహుల్ గాంధీ త్వరలో ఘటనా ప్రాంతంలో పర్యటించనున్నారు. రాహుల్ త్వరలో హథ్రాస్లో పర్యటిస్తారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఇది దురదృష్టకర ఘటన అని, హథ్రాస్లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పర్యటనకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. రాహుల్ హథ్రాస్కు వెళ్లి బాధితులతో మాట్లాడతారని వేణుగోపాల్ వెల్లడించారు.
కాగా, భోలే బాబా సత్సంగ్లో మంగళవారం జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య 121కు చేరుకుంది. అనేక మంది దవాఖానాల్లో చికిత్స పొందుతున్నారు. ఘటనపై జ్యుడీషియల్ విచారణకు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. ఈ ఘటనలో నిందితుడు భోలే బాబాపై ఆగ్రా, ఎతావాహ్, కస్గంజ్, ఫరూఖాబాద్, దూసా ప్రాంతాల్లో ఐదు లైంగిక దాడి కేసులు నమోదైన విషయం వెలుగులోకి వచ్చింది. 1997లో ఓ కేసులో అరెస్టయి కొన్నాళ్లు జైలు శిక్ష కూడా అనుభవించినట్టు తెలుస్తున్నది.
జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాతనే తన గ్రామంలో ఓ ఆశ్రమాన్ని ప్రారంభించాడు. తనకు గురువు ఎవరూ లేరని చెప్పుకునే భోలే బాబా.. కాషాయానికి బదులుగా తెల్లటి సూటు, బూట్లు, నల్ల కండ్లద్దాలు ధరిస్తూ ప్రత్యేకంగా కనిపిస్తుంటాడు.తనను నమ్మే వారిని భోలే బాబా అనేక మూఢ నమ్మకాలతో ముంచేశాడని తెలుస్తున్నది.
ముఖ్యంగా తాను నిర్వహించే సత్సంగ్లలో ఇచ్చే పవిత్ర జలం తాగితే భక్తుల సమస్యలు తీరిపోతాయనే ప్రచారం చేయించాడు. తన పాదధూళి కూడా పవిత్రమైనదని, బాబా నడిచిన నేలపై మట్టిని తాకినా అదృష్టం వరిస్తుందనే నమ్మకాన్ని సృష్టించాడు. ఇవి నమ్మి ఉత్తరప్రదేశ్తో పాటు ఉత్తరాఖండ్, హరియాణా, రాజస్థాన్తో పాటు ఢిల్లీ నుంచి పెద్ద ఎత్తున జనం భోలే బాబా దర్శనం కోసం వచ్చే వారు.
Read More :