High Court | బెంగళూరు: భర్తపై తప్పుడు ఆరోపణలతో కేసు పెట్టిన భార్యకు కర్ణాటక హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆమెపై కేసు పెట్టేందుకు ఆమె భర్తకు స్వేచ్ఛనిచ్చింది. భర్త అమెరికాలో ఉంటున్నారు. పెండ్లి అయిన రెండు నెలల తర్వాత హెచ్1బీ వీసా గడువు ముగియనుండటంతో తిరిగి అమెరికాకు వెళ్లారు. తన భార్యను కూడా అమెరికాకు తీసుకెళ్లడానికి ఐదుసార్లు అపాయింట్మెంట్లకు ప్రయత్నించారు.
కానీ ఆమె ఆసక్తి చూపలేదు. దీంతో ఆయన 2021 డిసెంబరు 3న విడాకుల కోసం బెంగళూరులోని కుటుంబ న్యాయస్థానంలో దరఖాస్తు చేశారు. 2022 ఫిబ్రవరి 3న భార్య తన భర్తపై ఫిర్యాదు చేశారు. తనను వరకట్నం కోసం వేధిస్తున్నారని ఆరోపించారు. మేజిస్ట్రేట్ కోర్టు దీనిని 2022 జూన్ 14న విచారణకు చేపట్టింది. భార్య కోర్టుకు హాజరై తన భర్తకు లైంగిక రోగం ఉందని ఆరోపించారు.
మరోవైపు రాజీ కోసం ప్రయత్నించినపుడు రూ.3 కోట్లు డిమాండ్ చేశారని భర్త ఆరోపించారు. ఈ నేపథ్యంలో జస్టిస్ నాగ ప్రసన్న ఈ కేసు వివరాలను పరిశీలించారు. భార్యకు స్త్రీ ధనంగా 614 గ్రాముల వెండి, 160 గ్రాముల బంగారం ఇచ్చారని గమనించారు. భార్య తల్లి, సోదరుడు ఇచ్చిన స్టేట్మెంట్లు, ఛార్జిషీటులోని వివరాలను పరిశీలించినపుడు భర్త వరకట్నం డిమాండ్ చేసినట్లు కాని, క్రూరత్వం ప్రదర్శించినట్లు కాని వెల్లడి కాలేదని గుర్తించారు. దీంతో ఆ భార్యపై కేసు పెట్టేందుకు భర్తకు అనుమతి ఇచ్చారు.