Karnataka | బెంగళూరు: కర్ణాటకలో మళ్లీ కుర్చీలాట మొదలయ్యింది. లోక్సభ ఎన్నికలు ముగిసే వరకు నిశ్శబ్దంగా ఉన్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు కుంపటి రాజేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్కు చెక్ పెట్టేందుకు సిద్ధరామయ్య వర్గం మరో ముగ్గురిని ఉప ముఖ్యమంత్రులుగా నియమించాలనే డిమాండ్ను తెరపైకి తెచ్చింది. మరోవైపు సిద్ధరామయ్య ఇక ముఖ్యమంత్రి కుర్చీ నుంచి దిగిపోయి శివకుమార్కు అప్పగించాలని ఆయన వర్గం కొత్త రాగం అందుకున్నది. దీంతో కర్ణాటక కాంగ్రెస్ రెండు వర్గాలుగా చీలిపోయింది. డీకేను నిలవరించేందుకు సిద్ధరామయ్య, సిద్ధరామయ్యకు ఎసరు పెట్టేందుకు డీకే తెరవెనుక ఉండి తమ వర్గీయులతో బాహాటంగా ప్రకటనలు చేయిస్తున్నారనే ప్రచారం జరుగుతున్నది.
ప్రస్తుతం కర్ణాటకలో డీకే శివకుమార్ మాత్రమే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు ఆయనతో పాటు లింగాయత్, ఎస్సీ/ఎస్టీ, మైనారిటీ వర్గాల నుంచి ఒక్కొక్కరి చొప్పున మరో ముగ్గురిని డిప్యూటీ సీఎంలుగా నియమించాలని మంత్రి కేఎన్ రాజన్న డిమాండ్ చేశారు. కాంగ్రెస్లో ఒక్కరికి ఒకే పోస్టు ఇవ్వాలనే పద్ధతి ఉందని, ఈ పద్ధతిని పాటించి డీకే శివకుమార్ తన పీసీసీ అధ్యక్ష పదవిని వదులుకోవాలని సైతం రాజన్న పేర్కొన్నారు. డీకే శివకుమార్కు చెక్ పెట్టేందుకు సీఎం సిద్ధరామయ్య వర్గం ఈ రెండు వాదనలను తెరపైకి తెచ్చినట్టు సమాచారం.
డీకే శివకుమార్కు వ్యతిరేకంగా సిద్ధరామయ్య వర్గం పావులు కదుపుతుండటంతో డీకే వర్గం కూడా అప్రమత్తమైంది. సిద్ధరామయ్య సీఎం పదవిని వదిలి శివకుమార్కు అప్పగించాలని చెన్నగిరి ఎమ్మెల్యే బసవరాజు శివగంగ బుధవారం డిమాండ్ చేశారు. సిద్ధరామయ్య గతంలో ఐదేండ్లు, ఇప్పుడు ఏడాదిన్నర సీఎంగా ఉన్నారని, ఇక దిగిపోవాలని పేర్కొన్నారు. మరో ముగ్గురు డిప్యూటీ సీఎంలను నియమించాలనే వాదనను కూడా డీకే వర్గం తప్పుపడుతున్నది. డిప్యూటీ సీఎం పదవి ఖాళీ లేదని మంత్రి చెలువరాయస్వామి.. సిద్ధరామయ్య వర్గానికి కౌంటర్ ఇచ్చారు.