Karnataka | బెంగళూరు, జూన్ 29: కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మంత్రులు, పార్టీ నేతలు, కార్యకర్తలు.. చివరకు పలువురు మఠాధిపతులు కూడా ఎవరికి వారు వర్గాలుగా విడిపోయారు. సీఎం పదవిని తమ వర్గం నేతలకు ఇవ్వాలని లేదా ఒకవేళ అదనంగా డిప్యూటీ సీఎం పోస్టులను ఏర్పాటు చేస్తే తమ వర్గం నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలని బహిరంగంగానే డిమాండ్లు చేస్తున్నారు. దీంతో రాష్ట్రంలో నాయకత్వ సంక్షోభం నెలకొన్నది.
ప్రస్తుత ప్రభుత్వంలో రాష్ట్రంలో బలమైన సామాజిక వర్గంగా ఉన్న ఒక్కలిగ వర్గానికి చెందిన డీకే శివకుమార్ ఒక్కరే డిప్యూటీ సీఎంగా ఉన్నారు. వీరశైవ-లింగాయత్, ఎస్సీ/ఎస్టీ, మైనార్టీ కమ్యూనిటీలకు కూడా డిప్యూటీ సీఎం పదవులు ఇవ్వాలనే డిమాండ్ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటైన గత ఏడాది నుంచే ఉన్నది. ఇటీవల ఆ డిమాండ్ మరింత ఊపందుకొన్నది. ఒక్కలిగ మహా సమస్థాన మఠానికి చెందిన చంద్రశేఖర కాంత స్వామీజీ గత గురువారం ఓ సందర్భంగా మాట్లాడుతూ ‘సీఎంగా మీరు దిగిపోయి, డీకేను ముఖ్యమంత్రిని చేయండి’ అంటూ బహిరంగంగానే సీఎం సిద్ధరామయ్యను కోరడం సంచలనంగా మారింది. దీనికి తర్వాతి రోజు వీరశైవ-లింగాయత్ మత పెద్ద శ్రీశైల జగద్గురు సిద్ధరామ పండితారాధ్య స్వామిజీ శుక్రవారం మాట్లాడుతూ ఒకవేళ రాష్ట్రంలో నాయకత్వ మార్పు అంశం పరిశీలనలో ఉంటే.. తమ వర్గానికి చెందిన మంత్రులను సీఎం పదవికి పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు. అదేవిధంగా అదనపు డిప్యూటీ సీఎం పోస్టులను ఏర్పాటు చేస్తే, అందులోనూ ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
‘నాకు ఎవరి సిఫారసు అవసరం లేదు. మేం చేసిన పనికి.. మా హైకమాండే నిర్ణయం తీసుకొంటుంది’ అని డీకే శివకుమార్ అన్నారు. సీఎం, డిప్యూటీ సీఎంల అంశంపై బహిరంగంగా లేదా మీడియాతో ఏ మంత్రీ మాట్లాడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.