MUDA Irregularities Case : మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) అవకతవకల కేసుకు సంబంధించి కర్నాటక సీఎం సిద్ధరామయ్య రాజీనామాకు కాషాయ పార్టీ డిమాండ్ చేయడంపై సీఎం స్పందించారు. ఈ అంశంపై తాను ఇప్పటికే విచారణకు ఆదేశించానని, తాము సీబీఐ విచారణకు డిమాండ్ చేసినప్పుడు వారు ఏ కేసైనా సీబీఐకి అప్పగించారా అని ఆయన బీజేపీని ప్రశ్నించారు.
ఇప్పుడు ప్రతి కేసుకూ బీజేపీ ఎందుకు సీబీఐ విచారణను కోరుతోందని ఆయన నిలదీశారు. సీబీఐకి తాము ఎందుకు కేసులను అప్పగించాలని అన్నారు. ముడా కేటాయింపుల విషయానికి వస్తే ఈ కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని వారంటున్నారని, దీనిపై విచారణ జరుగుతోందని, విచారణలో అక్రమాలు జరిగాయా, లేదా అనేది వెల్లడవుతుందని చెప్పారు. ముడా స్ధలాలను కేటాయించిన అధికారులను సస్పెండ్ చేయడం జరిగిందని, ఇంతకు మించి ఏం కావాలని అన్నారు.
ఎవరి హయాంలో స్ధలాలు కేటాయించారో అప్పటి అధికారులందరినీ తాము బదిలీ చేశామని వివరించారు. సీనియర్ అధికారి నేతృత్వంలో విచారణ జరుగుతోందని, నివేదిక రాగానే చర్యలు చేపడతామని చెప్పారు. అసలు తాను ఎందుకు రాజీనామా చేయాలని సిద్ధరామయ్య ప్రశ్నించారు. ఈ కేటాయింపుల్లో తన పాత్ర ఏముందని అన్నారు. తన రాజీనామాను కోరుతున్న ఆర్ అశోక్ ఆయనపై ఆరోపణలు వచ్చినప్పుడు ఏనాడైనా రాజీనామా చేశారా అని సిద్ధరామయ్య నిలదీశారు.
Read More :