బెంగళూరు, జూలై 2/(స్పెషల్ టాస్క్ బ్యూరో): కర్ణాటక కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిద్దరామయ్య భూకుంభకోణం వివాదంలో చిక్కుకొన్నారు. సిద్దరామయ్య, ఆయన కుమారుడు, ఎమ్మెల్సీ యతీంద్ర రూ. 4000 కోట్ల భూకుంభకోణానికి పాల్పడ్డారని ఆ రాష్ట్ర బీజేపీ ఆరోపించింది. సొంత జిల్లా మైసూరులో సీఎం తన సతీమణి పార్వతమ్మ పేరిట చట్టవిరుద్ధంగా కోట్ల విలువజేసే భూములు కేటాయించుకొన్నారని ప్రతిపక్ష బీజేపీ నాయకుడు ఆర్ అశోక్ ఆరోపించారు. ఈ కుంభకోణంలో మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) ఉన్నతాధికారులు ప్రమేయం కూడా ఉన్నదన్నారు. విషయం బయటకు రాకుండా ఉండేందుకే వారిని ప్రభుత్వం ఉన్నట్టుండి బదిలీపై పంపించిందని ఆరోపించారు. ఈ కుంభకోణం వివరాలు పూర్తిగా వెలుగులోకి రావాలంటే సీబీఐతో లేదా రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
బీజేపీ నేతల ఆరోపణల ప్రకారం.. మైసూరు శివారుల్లోని గ్రామీణ ప్రాంతాల్లో సిద్దరామయ్య భార్య పార్వతమ్మకు 3 ఎకరాల 16 గుంటల భూములు ఉన్నాయి. అయితే, అవసరాల దృష్ట్యా ఆ భూములను సేకరించిన ప్రభుత్వం.. వాటికి బదులుగా నగరంలోపల అత్యంత ఖరీదైన ప్రాంతాలుగా చెప్పుకొనే విజయనగర్, దట్టగల్లీ, జేపీ నగర్, ఆర్టీ నగర్, హంచయా-సతాగల్లీలో సిద్దు కుటుంబానికి భూములను కేటాయించింది. 50:50 నిష్పత్తిలో (పడావు పడ్డ ఒక ఎకరా తీసుకొంటే, అభివృద్ధి చేసిన అర్ధ ఎకరం ఇవ్వడం) ఈ భూముల కేటాయింపు జరిగింది. అయితే, సిద్దు కుటుంబానికి అత్యంత ఖరీదైన ప్రాంతాలలో ఆ భూములను కేటాయించాలని ఎవరు సిఫారసు చేశారని ఆర్ అశోక్ నిలదీశారు. క్యాబినెట్ అనుమతి లేకుండా భూములు కేటాయించే అధికారం ఎవరికి ఉంటుందని, ముఖ్యమంత్రికి తెలియకుండానే ఇంత పెద్ద కుంభకోణం జరిగిందా? అని ఆయన ప్రశ్నించారు.
ముడా భూకుంభకోణంలో యతీంద్ర పాత్ర ఉన్నదని, ఆయనే దీనికి అసలు సూత్రధారని బీజేపీ ఎమ్మెల్సీ హెచ్ విశ్వనాథ్ ఆరోపించారు. రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తుతో నిజాలు బయటకు రాబోవని, సీబీఐ దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. అయితే, ఈ అక్రమాల్లో యతీంద్ర పాత్ర ఉన్నదో లేదో ఇంకా తేలాల్సి ఉన్నదని పట్టణాభివృద్ధి శాఖా మంత్రి బైరతి సురేశ్ అన్నారు. భూ కేటాయింపులకు సంబంధించిన అన్ని ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్టు పేర్కొన్నారు. దోషులపై తగిన చర్యలు తీసుకొంటామన్నారు.
బీజేపీ నేతల ఆరోపణలను సీఎం సిద్దరామయ్య ఖండించారు. తమ కుటుంబానికి ఎవరు, ఎలా ఆ భూములను కేటాయించారో తనకు తెలియదని పేర్కొన్నారు. బీజేపీ హయాంలోనే ఈ కేటాయింపులు జరిగినట్టు చెప్పుకొచ్చారు. రింగ్రోడ్డుకు సమీపంలో తన భార్య పేరిట 3.16 ఎకరాల భూమి ఉన్న మాట వాస్తవమేనని పేర్కొన్నారు. తమ 3.16 ఎకరాలను సేకరించకుండానే ముడా అధికారులు అక్కడ లే అవుట్ వేశారని చెప్పారు. ఆ స్థలాలను లబ్ధిదారులకు పంపిణీ కూడా చేశారని అన్నారు. చట్ట ప్రకారం మా భూములకు బదులుగా 50:50 ప్రాతిపదికన వేరేచోట భూములు ఇస్తామని ముడా అంగీకరించిందని చెప్పారు. ఇదంతా బీజేపీ అధికారంలో ఉన్నప్పుడే జరిగిందని అన్నారు. ఇందులో తప్పేముందని ప్రశ్నించారు. భూముల కేటాయింపుల్లో 50:50 ఫార్ములాను బీజేపీనే ప్రతిపాదించిందని పేర్కొన్నారు.