Kallakurichi | తమిళనాడు రాష్ట్రంలోని కళ్లకురిచి (Kallakurichi) జిల్లా కరుణాపురంలో కల్తీసారా (Toxic Alcohol) తాగి మృతి చెందిన వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా మరో ఇద్దరు బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకూ కల్తీసారా ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 61 నుంచి 63కు పెరిగింది. సుమారు 115 మంది బాధితులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
మరోవైపు కల్తీసారా ఘటనపై ప్రతిపక్ష అన్నాడీఎంకే (AIADMK) నేతలు ఆందోళనకు దిగారు. డీఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్నాడీఎంకే నేతలు, సభ్యులు చెన్నైలో గురువారం నిరాహార దీక్ష చేపట్టారు. ఈ ఘటనపై సీబీఐ చేత విచారణ (CBI inquiry) జరిపించాలని డిమాండ్ చేశారు. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
అన్నాడీఎంకే ఎమ్మెల్యేలపై అసెంబ్లీలో సస్పెన్షన్
మరోవైపు కల్తీ మద్యం ఘటనపై ఆందోళన చేస్తున్న అన్నాడీఎంకే ఎమ్మెల్యేలపై అసెంబ్లీలో సస్పెన్షన్ వేటు పడింది. అసెంబ్లీ సమావేశాలు ముగిసే వరకు ఆ పార్టీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ విధించారు. బుధవారం సభలో ప్రశ్నోత్తరాలను వాయిదా వేసి కళ్లకురిచిలో కల్తీ మద్యం తాగి మరణాలు నమోదు అయిన ఘటనపై చర్చ చేపట్టాలని, ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ సీఎం స్టాలిన్ రాజీనామా చేయాలని అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. దీంతో ప్రతిపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామితో పాటు ఇతర అన్నాడీఎంకే ఎమ్మెల్యేలపై వేటు వేశారు. అసెంబ్లీ సమావేశాలను అడ్డుకుంటున్న అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను సభా నుంచి పంపించివేయాలంటూ తమిళనాడు స్పీకర్ ఎం అప్పవు ఆదేశించారు. దీంతో రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానాన్ని బుధవారం పాస్ చేశారు.
Also Read..
LK Advani | నిలకడగానే అద్వానీ ఆరోగ్య పరిస్థితి.. ఎయిమ్స్ వైద్యులు
Delhi | ఢిల్లీలో భారీ వర్షం.. మండుటెండల నుంచి ఉపశమనం