NEET UG 2024 : నీట్ యూజీ 2024 పరీక్షలో 67 మంది విద్యార్థులు ఆలిండియా ఫస్ట్ ర్యాంకు సాధించడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరీక్షలో మొత్తం 180 పశ్నలు ఉంటాయి. ఒక్కో సరైన సమాధానానికి 4 మార్కులు వస్తాయి. అన్ని సరైన సమాధానాలు రాసిన విద్యార్థికి 720 మార్కులు, కేవలం ఒకే తప్పు సమాధానం రాసిన విద్యార్థికి 715 మార్కులు రావాలి. అంతేతప్ప 715కు 720కి మధ్య మార్కులు వచ్చే ఛాన్స్ లేదు. కానీ కొందరు విద్యార్థులకు 718, 719 మార్కులు కూడా రావడంతో పరీక్షల్లో అక్రమాలు జరిగాయేమోనన్న అనుమానాలకు బలం చేకూరుతోంది.
దాంతో నీట్ పరీక్ష పేపర్ లీకయ్యిందని కొందరు, భారీ స్కామ్ జరిగిదని ఇంకొందరు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో వివాదంపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) స్పందించింది. ప్రశ్నలు సులువుగా ఉండటం, రిజిస్ట్రేషన్లు పెరగడం, ఒక ప్రశ్నకు రెండు సరైన సమాధానాలు ఉండటం, కొందరికి పరీక్ష సమయం తగ్గడంతో గ్రేస్ మార్కులు ఇవ్వడం లాంటివి పరీక్షలు కొందరు ఎక్కువ మార్కులు సాధించడానికి కారణమైందని ఎన్టీఏ పేర్కొంది. ఎన్సీఈఆర్టీ (NCERT) పుస్తకంలో మార్పు ప్రకారం ఒక ప్రశ్నకు రెండు సరైన సమాధానాలు ఉన్నాయని, ఆ ప్రశ్నకు ఇచ్చిన రెండు ఆప్షన్లను ఎన్సీఈఆర్టీ తమ పాత, కొత్త పుస్తకాల్లో సరైనవిగా గుర్తించిందని, దాంతో రెండు ఆప్షన్లను సరైనవిగా ప్రకటించామని, దాంతో 44 మంది అభ్యర్థుల మార్కులు 715 నుంచి 720కి పెరిగాయని ఎన్టీఏ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
ఈ నీట్ పరీక్షలో రికార్డు స్థాయిలో టాపర్లు నమోదవ్వడం, రూల్స్ ప్రకారం ఇప్పటివరకు ఎప్పుడులేని విధంగా కొందరికి 718, 719 మార్కులు రావడం విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళనకు దారితీసింది. పరీక్షల్లో అవకతవకలు జరిగాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అంతేగాక టాపర్స్లో కొందరు ఒకే ఎగ్జామ్ సెంటర్కు చెందినవారు కావడంతో స్కామ్ జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పరీక్షలో సమయం కోల్పోయినట్లు నివేదించిన కొందరు అభ్యర్థులకు గ్రేస్ మార్కులు ఇవ్వడంవల్ల ఇలా 718, 719 మార్కులు వచ్చాయని ఎన్టీఏ వివరించింది. కానీ ఏ ప్రాతిపదికన, ఎన్ని గ్రేస్ మార్కులు ఇచ్చారో చెప్పలేదు. 2024 మే 5న పరీక్ష నిర్వహణ సందర్భంగా కొన్ని పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులకు పేపర్లు ఇవ్వడం ఆలస్యం కావడంతో ఆందోళన వ్యక్తం చేశారని, అలాంటి కేసులను ఎన్టీఏ తీసుకుందని ఎన్టీఏ తెలిపింది. అభ్యర్థులు ఎదుర్కొన్న సమయ నష్టానికి పరిహారంగా 2018 జూన్ 13 నాటి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం నార్మలైజేషన్ ఫార్ములాను అమలు చేశామని ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది.
కాగా నీట్ యూజీ 2024 రిజిస్ట్రేషన్లు ఈ ఏడాది 16.85 శాతం పెరిగాయి. గతేడాది 20.59 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. ఈ ఏడాది 24.06 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. రిజిస్ట్రేషన్లు పెరగడంతో టాపర్ల సంఖ్య పెరిగిందని, ఈ ఏడాది పేపర్ సులువుగా ఉండటం కూడా టాపర్ల సంఖ్య పెరగడానికి దోహదపడిందని ఎన్టీఏ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. నీట్ యూజీ 2024 టాపర్లపై బ్యాక్గ్రౌండ్ చెక్ కూడా చేశామని, టాపర్లు 10వ తరగతి, 12వ తరగతిలో కూడా ఎక్కువ మార్కులు సాధించారని పేర్కొన్నారు. కాగా ఈ ఏడాది నీట్ పరీక్షకు 20.38 లక్షల మంది విద్యార్థులు హాజరుకాగా.. 11.45 లక్షల మంది అర్హత సాధించారు.