చెన్నై, జూలై 2: అదానీ గ్రూప్ నుంచి చేసుకున్న బొగ్గు దిగుమతుల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై విచారణ జరిపేందుకు డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ-కరప్షన్(డీవీఏసీ)కు తమిళనాడు ప్రభుత్వం అనుమతించింది. 2012 – 2016 మధ్య జరిగిన బొగ్గు దిగుమతుల్లో రాష్ర్టానికి రూ.3 వేల కోట్ల వరకు నష్టం వాటిల్లిందనే ఆరోపణల నేపథ్యంలో స్టాలిన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో అక్రమాల నిగ్గు తేల్చేందుకు డీవీఏసీ దర్యాప్తు ప్రారంభించింది. అదానీకి అనుకూలంగా టెండర్ల నియమాల్లో మార్పులు జరిగాయని, మార్కెట్ ధర కంటే అదానీ గ్రూపునకు ఎక్కువ ధర చెల్లించి బొగ్గు దిగుమతి చేసుకున్నారనే ఆరోపణలపై డీవీఏసీ దర్యాప్తు చేపట్టనుంది.
బొగ్గు దిగుమతిపై ఆరోపణలు
తమిళనాడులో 2012 – 2016 మధ్య విద్యుత్తు ఉత్పత్తి కోసం తమిళనాడు విద్యుత్తు ఉత్పత్తి, సరఫరా సంస్థ అయిన తమిళనాడు జెనెరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్(తంగెడ్కో).. అదానీ గ్లోబల్ సంస్థ ద్వారా బొగ్గును దిగుమతి చేసుకుంది. అయితే, ఈ ఒప్పందంలో అనేక అక్రమాలు జరిగాయని అరప్పోర్ ఇయక్కమ్ అనే సంస్థ కన్వీనర్ జయరామ్ వెంకటేశన్ ఆరోపిస్తూ వస్తున్నారు. రూ.6,066 కోట్ల విలువైన ఈ ఒప్పందంలో దాదాపు రూ.3,000 కోట్ల మేర అదానీ గ్లోబల్ సంస్థ అక్రమాలకు పాల్పడిందని జయరామ్ ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై విచారణ జరిపించాలని గత ఏడాది జనవరి 31న ముఖ్యమంత్రి స్టాలిన్కు లేఖ రాశారు.
Coal
టెండర్ నియమాలు మార్చారు.. ధర పెంచేశారు
అదానీ గ్లోబల్కు అనుకూలంగా 2011లో టెండర్ నియమాలు మార్చేశారని, కాగ్ కూడా ఈ అంశాన్ని గుర్తించిందని జయరామ్ ఆరోపిస్తున్నారు. టెండర్లో పాల్గొనే సంస్థ టర్నోవర్ రూ.100 కోట్లు ఉండాలనే నిబంధనను మార్చి రూ.1,000 కోట్లకు పెంచారని కాగ్ చెప్పినట్టు ఆయన పేర్కొన్నారు. మెట్రిక్ టన్ను బొగ్గుకు 15-20 డాలర్లు వరకు మార్కెట్ ధర కన్నా అదానీ గ్లోబల్కు ఎక్కువగా చెల్లించినట్టు జయరామన్ చెప్తున్నారు. పైగా అదానీ గ్లోబల్ నాణ్యమైన బొగ్గు దిగుమతి చేయలేదని, ఫలితంగా విద్యుత్తు ఉత్పత్తి సరిగ్గా జరగకపోవడం వల్ల రాష్ర్టానికి మరింత నష్టం వచ్చినట్టు ఆరోపిస్తున్నారు.
విచారణ కోసం పట్టు వదలని ప్రయత్నం
అదానీ నుంచి బొగ్గు దిగుమతి ఒప్పందంపై విచారణ కోసం జయరామ్ పట్టు వదలకుండా ప్రయత్నిస్తున్నారు. ఈ ఒప్పందంపై విచారణకు ప్రభుత్వం అనుమతించడం లేదని, కాబట్టి అసెంబ్లీలో నిరసన తెలిపేందుకు అవకాశం ఇవ్వాలని జూన్ 26న అసెంబ్లీ స్పీకర్కు లేఖ రాశారు. దీంతో విచారణ జరిపేందుకు డీవీఏసీకి తమిళనాడు ప్రభుత్వం ఆదేశించింది. తంగెడ్కో చేసుకున్న బొగ్గు దిగుమతుల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై ప్రాథమిక విచారణ జరిపేందుకు ప్రభుత్వం అనుమతించినట్టు డీవీఏసీ అధికారులు చెప్పినట్టు ‘ది హిందూ’ పేర్కొన్నది. అరప్పోర్ ఇయక్కమ్ సంస్థ ఫిర్యాదు మేరకు అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసినట్టు అధికారులు మంగళవారం తెలిపారు.