Billionaires | న్యూఢిల్లీ, జూన్ 29: దేశంలో ఒక పక్క బిలియనీర్ల సంపద ఎన్నో రెట్లు పెరుగుతుండగా, సామాన్యుడు మరింత పేదవాడు అవుతున్నాడు. ఈ తేడాసామాజికవర్గ పరంగా కూడా స్పష్టంగా పెరిగింది. దేశంలోని బిలియనీర్ల జాబితాలో ఎస్సీ, ఎస్టీలకు స్థానమే లేకుండా పోయింది. దేశంలోని 90 శాతం సంపద అగ్రవర్ణ బిలియనీర్ల చేతిలో కేంద్రీకృతమై ఉంది. ద వరల్డ్ ఇనీక్వాలిటీ ల్యాబ్ తాజా నివేదిక ఈ వాస్తవాలను వెల్లడించింది. ‘భారత్లో పన్ను న్యాయం, సంపద పునర్ విభజన వైపు’ పేరుతో వెలువడిన తాజా నివేదిక సంపద పంపిణీ సమస్యలను పరిశీలించింది. దేశంలోని మొత్తం సంపదలో 40 శాతం కేవలం ఒక శాతం ఉన్న వర్గం చేతిలో ఉండటం దేశంలో పెరుగుతున్న ఆర్థిక అసమానతలను సూచిస్తున్నదని పేర్కొన్నది. బ్రిటీష్ పాలన కాలంతో పోలిస్తే ఈ ఆధునిక యుగంలో అసమానతలు ఇలా ఎన్నో రెట్లు పెరగడం చాలా ప్రమాదకర ధోరణి అని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని కారణంగా ఇప్పటికే భారత్ ప్రపంచంలోని ఆర్థిక అసమానతలున్న దేశాల జాబితాలోకి చేరిపోయిందని వివరించారు.
ద వరల్డ్ ఇనీక్వాలిటీ ల్యాబ్ నివేదిక ప్రకారం భారతదేశంలోని 88.4 శాతం బిలియనీర్లు ఉన్నత వర్గాలకు చెందిన వారే. ధనవంతుల జాబితాలో షెడ్యూల్డ్ తెగలు, ఇతర బాగా వెనుకబడిన వర్గాలకు అసలు ప్రాతినిధ్యమే లేదు. ఈ తారతమ్యం బిలియనిర్ల సంపదలో కూడా కొట్టొచ్చినట్టు కన్పించింది. జాతి సంపదలో 55 శాతం ఉన్నత వర్గాల చేతిలో ఉన్నట్టు ఆల్ ఇండియా డెట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సర్వే (ఏఐడీఐఎస్) 2018-19లో చేసిన సర్వే ప్రకారం వెల్లడించింది. సంపద వైవిధ్యంలో ఈ పూర్తి వైరుధ్యం భారత దేశ కుల వ్యవస్థలో పాతుకుపోయిన లోతైన అసమానతలను స్పష్టం చేస్తున్నది. అలాగే సామాజిక వర్గం విద్య, ఆరోగ్యం, వ్యాపారం, సంపద సృష్టి తదితర అంశాలపై గణనీయమైన ప్రభావం చూపిస్తున్నది. దళితులు ఎక్కువ భూమిని కలిగి ఉండరాదని పలు ప్రాంతాల్లో ఉన్న ఆంక్షలు కూడా వారి ఆర్థిక ప్రగతికి ఆటంకంగా మారింది. అయితే ఈ వివక్ష కేవలం బిలియనీర్ల వరకే పరిమితం కాలేదు. దిగువ సామాజిక వర్గం వారు పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి కూడా పలు ఆటంకాలు ఏర్పడుతున్నాయని ద స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా, 2023 పేరిట అజీమ్ ప్రేమ్జీ యూనివర్సిటీ విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. శ్రామికశక్తి అధికంగా ఉన్నప్పటికీ ఎస్టీలు పారిశ్రామికవేత్తలుగా ఎదగలేకపోతున్నారు. ఎస్సీల శ్రామిక శక్తి 19.3 శాతం ఉండగా, అందులో 11.4 శాతం, ఎస్టీల్లో 10.1 శాతం శ్రామిక శక్తికి 5.4 శాతం మాత్రమే యజమానుల స్థాయికి ఎదిగారు.
సంపద అసమానత దిగువ వర్గాల సామాజిక వర్గాలలో బిలియనీర్ల ర్యాంకులకు మించి విస్తరించింది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే నివేదిక ప్రకారం 12.3 శాతం ఎస్సీలు, 5.4 శాతం ఎస్టీలు మాత్రమే అత్యధిక సంపద కలిగి ఉన్నారు. అయితే దానికి విరుద్ధంగా 25 శాతం పైగా ఎస్సీలు, 46.3 శాతం ఎస్టీలు అత్యల్ప సంపద వర్గంలో ఉన్నారు. అలాగే ఓబీసీ జనాభాలో 16.3 శాతం అత్యల్ప సంపద కేటగిరీ, 19.2 శాతం అత్యధిక సంపద కేటగిరీలలో ఉన్నారు. భారత్లో ఆదాయం, సంపదల మధ్య వ్యత్యాసం స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తగ్గినప్పటికీ 1980 నుంచి 2000 వరకు పెరుగుతూ వచ్చింది. 2014-15, 2022-23 మధ్య ఈ పెరుగుదల శిఖరాగ్ర స్థాయికి చేరుకుంది. దీంతో దేశంలోని 40 శాతం సంపద కేవలం ఒక శాతం వర్గం ఆధీనంలో ఉంది. 1980లో ఇది 12.5 శాతం మాత్రమే ఉండేది. అలాగే వారు మొత్తం పన్నుకు ముందు ఆదాయంలో 22.6 శాతం సంపాదిస్తున్నారు. ఇది 1980లో 7.3 శాతం ఉంది.
బ్రిటీష్ పాలన నాటితో పోలిస్తే భారత దేశంలో ఆర్థిక అసమానత నాటకీయంగా పెరిగింది. దీంతో ఆర్థిక అసమానతలు గల దేశాల లిస్ట్లో భారత్ కూడా చేరింది. ప్రస్తుత అంచనా ప్రకారం దేశంలో ఏడాదికి రూ.20.7 లక్షలు సంపాదించే వారు ఒక శాతం ఉండగా, 10 శాతం మంది ఏడాదికి రూ.2.9 లక్షలు ఆర్జిస్తున్నారు. దీనికి విరుద్ధంగా మధ్యస్థ వయోజనులు ఏడాదికి లక్ష మాత్రమే సంపాదిస్తుండగా, పేదలకు ఎలాంటి ఆదాయం లేదు. జనాభాలోని దిగువ 60 శాతం మంది జాతీయ సగటు ఆదాయంలో కేవలం 15 శాతం మాత్రమే పొందుతున్నారు. ఏడాదికి 21 లక్షలు సంపాదించే వారిని ధనవంతులుగా పరిగణిస్తారు.
వీరు దేశంలో 10 శాతం ఉన్నారు. ఏడాదికి 82 లక్షలు ఆర్జించే వారు అత్యంత ధనవంతులు కేటగిరీలోకి వస్తారు. వీరు ఒక శాతం ఉన్నారు. ఇక మధ్యస్థంగా ఉన్న వారు ఏడాదికి 4.3 లక్షల ఆదాయాన్ని కలిగి ఉన్నారు. ఈ మొత్తం వీరి కనీస అవసరాలకు సరిపోతున్నది తప్ప ఎలాంటి సంపదను కూడగట్టలేరు. ఇక మిగిలిన 50 శాతం మందిది అత్యల్ప ఆదాయం. జాతీయ ఆదాయంలో వీరిది 6.4 శాతం కాగా, కేవలం 1 శాతం ఉన్న కుబేరుల వాటా 40.1 శాతం. ఇక 0.001 శాతం ఉన్న అపర కుబేరుల వాటా 17 శాతం. దీని ప్రకారం కేవలం 0.001 శాతం ఉన్న 10 వేల లోపు అపర కుబేరుల ఆదాయం, అట్టడుగు స్థాయిలో ఉన్న 50 శాతం (సుమారు 46 కోట్ల మంది) సంపదతో సమానం.