BNS | న్యూఢిల్లీ, జూలై 3: ఇండియన్ పీనల్ కోడ్కు బదులు కొత్తగా అమలులోకి వచ్చిన భారతీయ న్యాయ సంహితలోని ఒక సెక్షన్ పట్ల న్యాయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీఎన్ఎస్లోని సెక్షన్ 69 ప్రకారం.. స్త్రీ, పురుషుల మధ్య సంబంధం విఫలమైనప్పుడు(బ్రేకప్ జరిగినప్పుడు) పురుషుడు వేధింపులకు గురయ్యే అవకాశం ఉందని, పదేండ్ల పాటు జైలులో ఉండాల్సిన పరిస్థితి కూడా రావొచ్చని చెప్తున్నారు. మహిళ కనుక తన వద్ద నిజాలు దాచి లేదా పెండ్లి చేసుకుంటానని చెప్పి శారీరకంగా కలిసి, ఇప్పుడు మోసం చేశాడని ఫిర్యాదు చేస్తే ఈ సెక్షన్ కింద పురుషుడిపై కేసు నమోదు చేయవచ్చు. నేరం రుజువైతే పురుషుడిపై పదేండ్ల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించవచ్చు.
మహిళలు, పిల్లలపై నేరాల నియంత్రణకు ఉద్దేశించిన బీఎన్ఎస్లోని చాప్టర్ 5లో సెక్షన్ 69 ఉంది. మోసపూరిత వాగ్దానాల ద్వారా లేదా నెరవేర్చే ఉద్దేశం లేనప్పటికీ పెండ్లి చేసుకుంటానని చెప్పి మహిళతో శారీరకంగా కలిస్తే పదేండ్ల జైలు శిక్ష, జరిమానా విధించవచ్చని ఈ సెక్షన్ చెప్తున్నది.
నిజాలు దాచిపెట్టి లేదా మోసం చేసి శారీరకంగా కలిశాడనే ఫిర్యాదుకు సంబంధించి చర్యలు తీసుకునేందుకు ఇంతకుముందు ఐపీసీలో నిర్దిష్టమైన సెక్షన్ అంటూ ఉండేది కాదు. అయితే, ‘అవాస్తవాల ద్వారా పొందిన సమ్మతి చెల్లదు’ అని చెప్పే సెక్షన్ 90 కింద కేసు నమోదు చేసేవారు. ఆ తర్వాత మహిళ తనపై అత్యాచారం చేశాడనే ఫిర్యాదు చేస్తే సెక్షన్ 375 కింద అత్యాచార కేసు కూడా నమోదు అయ్యేది.
ఈ సెక్షన్ ద్వారా ఇద్దరి సమ్మతి లేకుండా బ్రేకప్ జరిగినప్పుడు, రిలేషన్షిప్ కనుక పెండ్లి వరకు వెళ్లనప్పుడు కొన్నిసార్లు పురుషుడు వేధింపులకు గురయ్యే ప్రమాదం ఉంటుందని న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఇతర కారణాల వల్ల బ్రేకప్ జరిగినప్పటికీ మహిళ ఫిర్యాదు చేస్తే పురుషుడు ఈ సెక్షన్ కింద నేరారోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఫిర్యాదు చేయగానే పురుషుడిని పోలీసులు అరెస్టు చేస్తారు. నిజాలు తర్వాత విచారణలో తేలుతాయని చెప్తున్నారు.