రాంచి, జూలై 3: జార్ఖండ్ ముఖ్యమంత్రిగా మరోసారి హేమంత్ సొరేన్ బాధ్యతలు చేపట్టనున్నారు. మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన హేమంత్ సొరేన్ జూన్ 28న బెయిల్పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో బుధవారం జేఎంఎం నేతృత్వంలోని కూటమి ఎమ్మెల్యేలు సమావేశమై హేమంత్ను శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో ఆయన మరోసారి ముఖ్యమంత్రి కావడం లాంఛనం అయ్యింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాల్సిందిగా హేమంత్ సొరేన్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ను కోరారు. త్వరలోనే ఆయన ప్రమాణస్వీకారం ఉండనుంది. దీంతో జార్ఖండ్ 13వ ముఖ్యమంత్రిగా హేమంత్ సొరేన్ బాధ్యతలు చేపట్టనున్నారు.
తన అరెస్టు ఖాయం కావడంతో జనవరి 31న హేమంత్ సొరేన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఫిబ్రవరి 2న జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) సీనియర్ నేత చంపయీ సొరేన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. హేమంత్ మరోసారి ముఖ్యమంత్రి కాబోతుండటంతో బుధవారం చంపయీ సొరేన్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజ్భవన్లో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ను కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించారు. జేఎంఎం నేతృత్వంలోని కూటమి నిర్ణయం మేరకు రాజీనామా చేసినట్టు ఆయన ప్రకటించారు.
హేమంత్ సొరేన్కు బెయిల్ మంజూరు చేస్తూ జార్ఖండ్ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును త్వరలో సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్నట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) వర్గాలు తెలిపాయి. ఈ మేరకు త్వరలోనే స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయనున్నట్టు తెలుస్తున్నది. ఇదే జరిగితే సుప్రీంకోర్టు తీర్పుపై జార్ఖండ్ రాజకీయాలు ఆధారపడే అవకాశం ఉంది. కాగా, హేమంత్ సొరేన్ నేరం చేశారని నమ్మడానికి ఆధారాలు కనిపించడం లేదని జార్ఖండ్ హైకోర్టు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.