రాంచి, జూలై 4: జార్ఖండ్ ముఖ్యమంత్రిగా జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) కార్య నిర్వాహక అధ్యక్షుడు హేమంత్ సొరేన్ గురువారం మూడోసారి ప్రమాణస్వీకారం చేశారు. రాజ్భవన్లో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి తాజా మాజీ ముఖ్యమంత్రి చంపయూ సొరేన్, హేమంత్ తండ్రి, జేఎంఎం అధినేత శిబు సొరేన్, తల్లి రూపి సొరేన్, భార్య కల్పన సొరేన్, జేఎంఎం కూటమి నేతలు హాజరయ్యారు. ఐదు నెలల క్రితం మనీలాండరింగ్ కేసులో జైలుకు వెళ్లేముందు జనవరి 31న హేమంత్ సొరేన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. హేమంత్ తర్వాత చంపయూ సొరేన్ సీఎం పగ్గాలు చేపట్టి, తాజాగా రాజీనామా చేశారు. దీంతో హేమంత్ సొరేన్ మరోసారి సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు.
ప్రమాణ స్వీకారంలో నినాదాలు చేయరాదు
న్యూఢిల్లీ, జూలై 4: ఎంపీల ప్రమాణ స్వీకార సమయంలో చోటుచేసుకున్న నినాదాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్ ఓం బిర్లా.. కొత్త నిబంధనను అమల్లోకి తీసుకొచ్చారు. నిర్దేశిత ప్రమాణం లేదా ధృవీకరణకు ఎంపీలు కచ్చితంగా కట్టుబడి ఉండేలా చట్టంలో కొత్త నిబంధనను చేర్చారు. జూన్ 28న నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ‘భారత రాజ్యాంగం 3వ షెడ్యూల్లో నిర్దేశించినదానికి అనుగుణంగా లోక్సభ సభ్యుడి ప్రమాణ స్వీకారం లేదా ధృవీకరణ ఉండాలి. ప్రమాణ స్వీకారం చేస్తుండగా సభ్యులు ఇతర పదాలు, నినాదాలు అందులో జోడించరాదు’ అని పేర్కొనే కొత్త క్లాజ్ను చట్టంలో ప్రవేశపెట్టారు. తాజాగా సభ్యుల ప్రమాణ స్వీకార సమయంలో కొంతమంది జై సంవిధాన్, జై హిందూ రాష్ట్ర, జై పాలస్తీనా.. వంటి నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ కొత్త నిబంధన తెచ్చారు.
వచ్చే రెండేండ్లలో 10 వేల నాన్-ఏసీ కోచ్లు: రైల్వే
న్యూఢిల్లీ, జూలై 4: రైల్వే ప్రయాణికులకు శుభవార్త! రైళ్లలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని భారతీయ రైల్వే, రాబోయే రెండేండ్లలో దాదాపు 10 వేల నాన్-ఏసీ రైల్వే కోచ్ల తయారీ చేపట్టబోతున్నది. ఇందుకు సంబంధించిన పనులకు ఆమోదముద్ర వేసినట్టు రైల్వే వర్గాలు గురువారం మీడియాకు వెల్లడించాయి. 2024-25, 2025-26 ఆర్థిక సంవత్సరాల్లో 9,929 నాన్-ఏసీ రైల్ కోచ్ల తయారీకి ఆమోదముద్ర వేశారు. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో 4,485, తదుపరి ఆర్థిక సంవత్సరంలో 5,444 రైల్వే కోచ్ల తయారీ ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు. మొత్తం కోచ్ల్లో జనరల్ బోగీల సంఖ్య మూడోవంతు ఉంటుందని తెలిసింది.