Delhi | న్యూఢిల్లీ, జూన్ 28: భారీ వర్షాలకు ఢిల్లీ నగరం చిగురుటాకులా వణికిపోయింది. శుక్రవారం తెల్లవారు జామున 3 గంటలకు మొదలైన వాన ఏకధాటిగా మూడు గంటలకు పైగా కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనాలు నీట మునిగాయి. అనేక ప్రాంతాల్లో ఇండ్లలోకి నీరు చేరింది. ప్రగతి మైదాన్ టన్నెల్లో భారీగా నీరు నిలిచిపోయింది. దీంతో రాజధానిలో జనజీవనం స్తంభించిపోయింది. 24 గంటల్లో ఢిల్లీలో 228.1 ఎంఎం వర్షపాతం నమోదయ్యిందని వాతావరణ శాఖ ప్రకటించింది. సాధారణంగా ఢిల్లీలో జూన్ నెల మొత్తం కలిపి సగటున 74.1 ఎంఎం వర్షపాతం నమోదవుతుంది. మూడు నెలల్లో కురవాల్సిన వర్షం కంటే ఎక్కువ కేవలం 24 గంటలల్లోనే పడింది. 1936 తర్వాత జూన్లో అత్యధిక వర్షపాతం నమోదయ్యింది ఇప్పుడేనని వాతావరణ శాఖ వెల్లడించింది.
భారీ వర్షాల కారణంగా ఢిల్లీలోని ఎంపీలు, మంత్రుల ఇండ్లలోకి కూడా నీరు చేరింది. లోధి ఎస్టేట్ ప్రాంతంలో సమాజ్వాదీ పార్టీ ఎంపీ రామ్గోపాల్ యాదవ్ ఇంటి ముందు రోడ్డుపై మోకాళ్ల లోతు నీరు నిలవడంతో ఆయనను భుజాలపై ఎత్తుకొని కారు ఎక్కించారు. కాగా, తాను నిద్ర లేచే సరికి తన ఇంట్లోకి అడుగు ఎత్తులో నీరు చేరిందని, ఫర్నీచర్, వస్తువులన్నీ తడిచిపోయాయని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ఇటీవల నీటి కొరతతో నిరాహార దీక్షకు దిగిన ఢిల్లీ మంత్రి అతిశీ ఇల్లు కూడా నీట మునిగింది. అసాధారణ రీతిలో భారీ వర్షం కురవడంతో ఢిల్లీ ప్రభుత్వం అత్యవసర సమావేశం నిర్వహించింది. ఢిల్లీలో మొత్తం వర్షాకాలం కలిపి 800 ఎంఎం వర్షం పడాల్సి ఉండగా, 24 గంటల్లోనే ఇందులో 25 శాతం(228 ఎంఎం) వర్షం కురవడం వల్ల సమస్యలు తలెత్తాయని మంత్రి అతిశీ పేర్కొన్నారు.