Supreme Court | హత్రాస్ తొక్కిసలాట కేసు సుప్రీంకోర్టుకు చేరింది. ఘటనపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి పర్యవేక్షణలో ఐదుగురు సభ్యులతో కూడిన నిపుణుల కమిటీని వేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఉత్తర్ప్రదేశ్లోని హత్రాస్లో జరిగిన సత్సంగ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 124 మంది మృత్యువాతపడ్డారు. 200 మందికిపైగా గాయపడ్డారు. భోలే భాబా అలియాస్ బాబా నారాయణ్ హరి సంస్థ ఈ సత్సంగ్ను నిర్వహించింది. మృతుల్లో ఏడుగురు చిన్నారులతో 100 మందికిపైగా మహిళలు ఉన్నారు. తొక్కిసలాటతో సత్సంగ్ జరిగిన ప్రాంతం మృతదేహాలతో మరుభూమిలా మారిందని న్యాయవాది విశాల్ తివారి పేర్కొన్నారు.
జూలై 2 ఘటనపై స్టేటస్ రిపోర్ట్ను సమర్పించాలని.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులతో పాటు నిర్వాహకులపై చర్యలు తీసుకునేలా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించాలని సుప్రీంకోర్టును కోరారు. హత్రాస్లో మంగళవారం భోలే బాబా నిర్వహించిన శివారాధన కార్యక్రమం జరిగింది. సాయంత్రం సత్సంగం ముగిసిన తర్వాత.. హాజరైన భక్తులు భోలే బాబా దర్శనంతో పాటు ఆయన పాదాల చుట్టూ ఉన్న మట్టిని తీసుకునేందుకు వెళ్లే క్రమంలో ఒకరిపై ఒకరు పడడం తొక్కిసలాటకు దారితీసింది. దీంతో పలువురు ఊపిరిరాడక ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు, ఈ ఘటనపై ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.