Hathras Stampede | హత్రాస్ తొక్కిసలాట కేసులో పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. ఈ ఘనటలో సత్సంగం ఆర్గనైజింగ్ కమిటీతో సంబంధాలు ఉన్న ఆరుగురును వ్యక్తులను అరెస్టు చేశారు. ప్రధాన నిర్వాహకుడిని పట్టుకునేందుకు రూ.లక్ష రివార్డును ప్రకటించినట్లు అలీగఢ్ ఐజీ శలభ్ మాథుర్ తెలిపారు. నిందితులను గుర్తించి అరెస్టు చేసేందుకు ఎస్ఓజీ బృందాలను నియమించామన్నారు. అలాగే, సంఘటనా స్థలంలో లభించిన ఆధారాల మేరకు విచారణ చేస్తున్నట్లు తెలిపారు. బాబా పాద ధూళి తీసుకుంటే కష్టాలు తొలగిపోతాయని అరెస్టయని వ్యక్తులు చెప్పారన్నారు. అరెస్టు అయిన వ్యక్తులంతా సేవలకు పని చేస్తున్నామని చెప్పారని అన్నారు. కమిటీకి అధ్యక్షుడు, సభ్యులు ఉన్నారని విచారణలో తెలిపారన్నారు.
అవసరమైతే బాబాను ప్రశ్నిస్తామన్నారు. అప్పటి వరకు 121 మంది మృతి చెందారని.. మృతుల ఆచూకీ గుర్తించినట్లు తెలిపారు. పోస్టుమార్టం ప్రక్రియ సైతం పూర్తయ్యిందన్నారు. ఈ ఘటనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రధాన నిందితుడు మధుకర్ను పట్టుకునేందుకు రూ.లక్ష రివార్డును ప్రకటించామని.. త్వరలోనే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయబోతున్నట్లు చెప్పారు ఈ ఘటనలో ఏదైనా కుట్ర ఉందా? అనే కోణంలోనూ విచారణ జరుపుతున్నట్లు ఐజీ పేర్కొన్నారు. జనాలు ఒకేసారి గుంపుగా రాగా.. నిర్వాహకులు అడ్డుకున్నారని.. ఆ తర్వాత ఒకేసారి బయటకు రావడంతో ప్రమాదం జరిగిందన్నారు. మహిళలు, పిల్లలు ఒకరిపై పడిపోయారన్నారు. భోలే బాబా నేర చరిత్రకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నామని ఐజీ వెల్లడించారు. అయితే, సత్సంగ్కు ఆయన పేరుతో కార్యక్రమానికి అనుమతి తీసుకోలేదని తెలిపారు.