Gold deposits | ఒడిశాలోని పలు జిల్లాల పరిధిలో బంగారం నిక్షేపాలు ఉన్నాయని ఆ రాష్ట్ర ఉక్కు, భూగర్భ గనుల శాఖ మంత్రి బిభుతి భూషణ్ జెనా తెలిపారు. డియోగఢ్ జిల్లాలోని ఆదాష్-రాంపల్లి ప్రాంతంలో కాపర్ ఓర్ తోపాటు బంగారం నిక్షేపాలు ఉన్నట్లు జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) సర్వేలో తేలిందని గురువారం అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యుడు తారాప్రసాద్ బాహినిపతి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ బ్లాక్ వేలానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.
కియోంజార్ జిల్లాలోని గోపూర్-గజిపూర్ ప్రాంతంలో 1981-83 నుంచి 1989-96 మధ్య ప్రాథమిక సర్వేతోపాటు 2021-22 నుంచి జియాలిజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ), మైన్స్ అండ్ జియాలజీ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో సంయుక్త సర్వేలు జరిగాయని మంత్రి బిభూతి భూషణ్ జెనా తెలిపారు. అక్కడ ఎంత మొత్తం బంగారం నిక్షేపాలు ఉన్నాయన్న విషయమై అంచనా వేయలేదన్నారు.
కియాంజార్ జిల్లాలోని మంకడచువాన్, సలైకానా, దిమిరిముందా ప్రాంతాల్లో బంగారం నిక్షేపాలపై ఒడిశా మైనింగ్ కార్పొరేషన్ (ఓఎంసీ) సర్వీ నిర్వహించిందని మంత్రి బిభూతి భూషణ్ జెనా తెలిపారు. మయూర్ భంజ్ జిల్లాలోని జోషిపూర్, సురియాగుడా, రువాన్ సిలా, ఇదెల్ కుచ, మారెదిహి, సులాయి పేట్ (ధుషురా హిల్) ప్రాంతాల్లో బంగారం నిక్షేపాలపై జీఎస్ఐ, మైన్స్ అండ్ జియాలజీ డైరెక్టరేట్ ప్రాథమిక సర్వే నిర్వహించాయని చెప్పారు. సుందర్ గఢ్, నబరంగపూర్, అంగుల్, కోరాపుట్, మల్కాన్ గిరి, సంబల్ పూర్, బౌధ్ జిల్లాల పరిధిలో కొద్ది మొత్తంలో బంగారం నిక్షేపాలు ఉన్నట్లు తేలిందన్నారు. అయితే, ఈ ప్రాంతంలో సవివరమైన అధ్యయనం జరుగలేదన్నారు.