పాట్నా: తండ్రి కోసం ఇంటి నుంచి బయటకు వచ్చిన నాలుగేళ్ల బాలికపై గుర్తు తెలియని వ్యక్తులు గన్తో కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఆ చిన్నారి రక్తం ముడుగుల్లో పడి మరణించింది. (girl shot dead) బీహార్ రాజధాని పాట్నాలో ఈ సంఘటన జరిగింది. రూపస్పూర్ ప్రాంతంలో అద్దె ఇంట్లో నివసిస్తున్న హరి ఓం కుమార్ మెడికల్ రిప్రజెంటేటివ్గా పని చేస్తున్నాడు. మంగళవారం రాత్రి అతడు ఇంటికి తిరిగి వచ్చాడు. తండ్రి రాకను గమనించిన నాలుగేళ్ల కూతురు ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఇంట్లోకి వెళ్లిన కుమార్ బైక్ను పార్క్ చేశాడు. అతడు తెచ్చిన సరుకులను భార్య ఇంట్లోకి తీసుకెళ్లింది.
కాగా, ఇంటి బయట ఉన్న నాలుగేళ్ల పాపపై గుర్తు తెలియని వ్యక్తులు గన్తో కాల్పులు జరిపారు. కాల్పుల శబ్ధం విన్న చిన్నారి తల్లిదండ్రులు వెంటనే ఇంటి బయటకు వచ్చారు. తమ కుమార్తె రక్తం మడుగుల్లో పడి ఉండటం చూసి షాక్ అయ్యారు. వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా ఆ బాలిక అప్పటికే మరణించినట్లు డాక్టర్లు తెలిపారు.
మరోవైపు ఈ సమాచారం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కాల్పుల్లో మరణించిన బాలిక మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించిన తర్వాత తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారిపై కాల్పులు జరిపిన నిందితులను గుర్తించేందుకు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు.