న్యూఢిల్లీ: సుదీర్ఘ మిషన్లో ఉన్న ఫ్రెంచ్ యుద్ధ విమానాలు అనూహ్యంగా భారత్లో ల్యాండ్ అయ్యాయి. ‘పెగేస్ 22’ కోడ్ పేరుతో ఇండో-పసిఫిక్లో సుదీర్ఘ మిషన్ను ఫ్రాన్స్ చేపట్టింది. ఈ మిషన్ మొదటి దశలో మెట్రోపాలిటన్ ఫ్రాన్స్ నుంచి ఫ్రెంచ్ భూభాగమైన న్యూ కాలెడోనియా వరకు ఆ దేశ వైమానిక దళాన్ని 72 గంటల కంటే తక్కువ సమయంలో మోహరించనున్నారు. తద్వారా సుదూర ఎయిర్ పవర్లో ఫ్రాన్స్ సామర్థ్యాన్ని చాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఇందులో భాగంగా ఆగస్ట్ 10-11 మధ్య ఫ్రెంచ్ వైమానిక దళ ఫైటర్ జెట్లు ఏకధాటిగా 16,600 కిలోమీటర్ల దూరం ప్రయాణించాయి. అయితే అనూహ్యంగా బుధవారం సాయంత్రం తమిళనాడులోని సూలూర్ ఎయిర్బేస్లో దిగాయి. ఇందులో మూడు రాఫెల్ జెట్లు, సహాయక విమానాలు ఉన్నాయి. ఇంధనం నింపుకున్న తర్వాత గురువారం తెల్లవారుజామున న్యూ కలెడోనియాకు ఫ్రెంచ్ యుద్ధ విమానాలు బయలుదేరాయి. ఆగస్ట్ 10న ప్రారంభమైన మిషన్ ‘పెగేస్ 22’ సెప్టెంబర్ 18 వరకు కొనసాగుతుంది.
కాగా, ఫ్రెంచ్ యుద్ధ విమానాలు భారత్లో దిగడం తమ మధ్య పటిష్ఠ రక్షణ సంబంధాలకు నిదర్శమని ఇరు దేశాలు పేర్కొన్నాయి. ‘ఫ్రెంచ్, భారత వైమానిక దళాల మధ్య పరస్పర విశ్వాసం, పరస్పర చర్యను ఈ ఆపరేషన్ ప్రదర్శించింది. రెండు వైమానిక దళాలు ఇప్పుడు రాఫెల్ జెట్లను కలిగి ఉన్నాయి’ అని ఫ్రాన్స్ రాయబార కార్యాలయం గురువారం ప్రకటించింది.
మరోవైపు మిషన్ ‘పెగేస్ 22’ తర్వాత దశలో భాగంగా ఆగస్ట్ 17 నుండి సెప్టెంబర్ 10 వరకు ఆస్ట్రేలియాలో జరిగే ‘పిచ్ బ్లాక్’ విన్యాసాల్లో ఫ్రెంచ్ యుద్ధ విమానాలు పాల్గొంటాయి. ఈ బహుపాక్షిక డ్రిల్లో ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా, జర్మనీ, ఇండోనేషియా, సింగపూర్, బ్రిటన్, దక్షిణ కొరియా ఎయిర్ఫోర్స్లతో పాటు భారత వైమానిక దళ యుద్ధ విమానాలు కూడా పాల్గొంటాయి.