పాటియాలా: పంజాబ్లో ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ(Free Bus Scheme) సౌకర్యం కల్పించిన విషయం తెలిసిందే. 2021 ఏప్రిల్లో అమరిందర్ సింగ్ ప్రభుత్వం ఆ స్కీమ్ను ప్రారంభించింది. ఆ స్కీమ్ వల్ల పంజాబీ మహిళలు కొంత లాభపడ్డారు. ప్రభుత్వ బస్సుల్లోనే పేద మహిళలు ప్రయాణిస్తున్నారు. తక్కువ ఆదాయం ఉన్న మహిళలు ఉచితంగా ట్రావెల్ చేస్తున్నారు. కానీ పెప్సు రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్(పీఆర్టీసీ) తీవ్ర నష్టాల్లో ఉన్నది. ఆ సంస్థ ఆదాయానికి గండిపడింది.
మరో వైపు ఆ సంస్థకు ప్రభుత్వం ఇవ్వాల్సిన 250 కోట్లు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో.. పీఆర్టీసీ తమ ఉద్యోగులకు జీతాలు, పెన్షలు ఇవ్వలేకపోతున్నది. బకాయిలు రిలీజ్ చేయాలని ప్రభుత్వానికి అనేక మార్లు లేఖలు రాసినట్లు పీఆర్టీసీ అధికారులు తెలిపారు. నిజానికి రూల్స్ ప్రకారం ప్రతి నెలా బకాయిలను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుందని పీఆర్టీసీ అధికారి చెప్పారు.
మహిళలకు ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని గత కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టింది. రీయంబర్స్మెంట్ రూపంలో ప్రతి రోజు ప్రభుత్వం పీఆర్టీసీకి కోటి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో రీయంబర్స్మెంట్ ఆలస్యమైంది. దీంతో పీఆర్టీసీ ఆర్ధికంగా బలహీన పడింది. ఫ్రీ బస్సు స్కీమ్ సక్సెస్ అయిన నేపథ్యంలో ఆ స్కీమ్ను కొనసాగించనున్నట్లు ఆర్థిక మంత్రి హర్పాల్ చీమా ఇటీవల తెలిపారు. ఆ సర్వీసులను కొనసాగించేందుకు 450 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. కానీ బకాయిలు రిలీజ్ కాకపోవడం వల్ల ఆర్టీసీ ఉద్యోగుల, పెన్షనర్లు జీతాల కోసం ఎదురుచూస్తున్నారు.