Kavitha | మద్యం పాలసీ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ నిరాకరించింది. సీబీఐ, ఈడీ కేసుల్లో కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై సుదీర్ఘంగా విచారించిన కోర్టు మే 28న తీర్పు రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే. రెండు కేసుల్లోనూ బెయిల్ను నిరాకరిస్తూ తుది తీర్పును వెలువరించింది. మహిళ కావడంతో బెయిల్ మంజూరు చేసే అంశాన్ని పరిశీలించాలని న్యాయవాది కోరారు. సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ బెయిల్ను సీబీఐ, ఈడీ వ్యతిరేకించాయి. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మార్చి 15న కవితను బంజారాహిల్స్లోని నివాసంలో ఈడీ అధికారులు ఆమెను అరెస్టు చేశారు. ఆ తర్వాత కోర్టులో అధికారులు హాజరుపరిచారు. అనంతరం ఈడీ విజ్ఞప్తి మేరకు ఈడీ కస్టడీకి ఇచ్చింది. ఈడీ విచారణ ముగియడంతో కోర్టు జ్యుడీషియల్ కస్టడీకి ఇచ్చింది. ఇదే కేసులో కవితను ఏప్రిల్ 11న సీబీఐ అరెస్టు చేసింది. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీపై తిహార్ జైలులో ఉన్నారు.