న్యూఢిల్లీ: నీలి రంగులో కనిపించే సముద్ర జలాలు ఆకుపచ్చ రంగులోకి మారుతున్నాయి. మానవ కంటికి కనిపించని ఈ మార్పు, సముద్ర పర్యావరణ వ్యవస్థలో అత్యంత నిగూఢంగా జరుగుతున్నదని పరిశోధకులు గుర్తించారు.
భూమిపై మహా సముద్రాల రంగులో గణనీయమైన మార్పు వచ్చిందని బ్రిటన్కు చెందిన ‘నేషనల్ ఒషియోనోగ్రఫీ సెంటర్’ పరిశోధకులు తేల్చారు. గ్లోబల్ కార్బన్ సైకిల్, సముద్ర పర్యావరణ వ్యవస్థలో ఏర్పడ్డ మార్పులే దీనికి కారణమని అధ్యయనం పేర్కొన్నది.
నాసాకు చెందిన ‘ఆక్వా’ శాటిలైట్ గత 20 ఏండ్లుగా విడుదల చేస్తున్న డాటాను పరిశోధకులు విశ్లేషించగా, సముద్ర జలాల్లో 56శాతం ఆకుపచ్చ రంగులోకి మారిందని, రంగు మార్పు 2002 నుంచి మొదలైందని తేలింది.