న్యూఢిల్లీ, జూలై 4: నీట్-యూజీ పరీక్షను రద్దు చేయవద్దంటూ 56 మంది ర్యాంకర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పరీక్షను రద్దు చేయకుండా కేంద్ర ప్రభుత్వం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలకు తగిన ఆదేశాలు జారీచేయాల్సిందిగా ఆ పిటిషన్లో కోరారు. ‘పరక్ష రద్దు అనేది నిజాయితీగా, కష్టపడి చదివిన విద్యార్థులను నష్టపరుస్తుంది. అంతేగాక వారి విద్యాహక్కు ఉల్లంఘనకు దారితీస్తుంది’ అని గుజరాత్కు చెందిన సిద్ధార్థ్ కోమల్ సింగ్, మరో 55 మంది ర్యాంకర్లు పిటిషన్లో తెలిపారు.
పరీక్ష నిర్వహణలో జరిగిన అక్రమాలపై దర్యాప్తు చేసేందుకు కేంద్ర విద్యాశాఖకు తగిన ఆదేశాలు జారీచేయాలని వారు కోరారు. పేపర్ లీక్ సహా ఇతర అక్రమాలకు పాల్పడ్డవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. నీట్-యూజీ పరీక్ష రద్దు కోరుతూ సుప్రీంకోర్టులో ఇప్పటికే 26 పిటిషన్లు దాఖలయ్యాయి. అత్యున్నత న్యాయస్థానం వీటిపై జూలై 8న విచారణ చేపడుతున్నది. మరోవైపు పరీక్షను రద్దు చేయవద్దంటూ 56 మంది ర్యాంకర్లు కోర్టు గడప తొక్కటం గమనార్హం.