NEET Issue : నీట్ పరీక్ష లోటుపాట్లు, ప్రశ్నాపత్రాల లీకేజ్, యూజీసీ-నెట్ పరీక్ష రద్దు వ్యవహారంపై కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నీట్ పరీక్ష రాసిన 14 లక్షల మంది విద్యార్దుల్లో 5 నుంచి 10 శాతం ముస్లింలు ఉంటారని, మిగిలిన వారంతా హిందువులేనని అన్నారు.
హిందువులను కాపాడే బాధ్యత తీసుకున్న వారంతా ఇప్పుడు ఎక్కడున్నారని ఆయన ప్రశ్నించారు. ఇది హిందూ విద్యార్ధులకు అన్యాయం చేసినట్టు కాదా అని దిగ్విజయ్ సింగ్ కాషాయ పాలకులను నిలదీశారు. దీనిపై బీజేపీ మాతృసంస్ధ ఆరెస్సెస్, ప్రధాని నరేంద్ర మోదీ ఒక్క మాట కూడా మాట్లాడలేదని మండిపడ్డారు.
ఇక అంతకుముందు నీట్ పరీక్ష అవకతవకలపై కాంగ్రెస్ నేత జైరాం రమేష్ బీజేపీ లక్ష్యంగా విమర్శలతో విరుచుకుపడ్డారు. నీట్ అక్రమాలపై విద్యార్దులు ఆందోళన చెందుతూ నిరసన బాట పట్టారని అన్నారు. యూపీ, మధ్యప్రదేశ్, గుజరాత్ కేంద్రంగా ఎడ్యుకేషన్ స్కామ్లు జరిగాయని రాహుల్ గాంధీ చెబుతున్నారని, ఈ మూడూ బీజేపీ పాలిత రాష్ట్రాలేనని జైరాం రమేష్ గుర్తుచేశారు.
నీట్ పరీక్షను రాసిన లక్షలాది విద్యార్ధుల భవితకు భరోసా ఎవరని ఆయన ప్రశ్నించారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీపై పలు ప్రశ్నలు రేకెత్తుతున్నాయని అన్నారు. ప్రభుత్వ ఏజెన్సీల్లో నియామకాల కోసం నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీని నెలకొల్పుతామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారని, కానీ ఇప్పటివరకూ ఆ ఏజెన్సీ ద్వారా ఒక్క నియామకం కూడా చేపట్టలేదని పేర్కొన్నారు.
Read More :
RTC Bus | ఆర్టీసీ బస్సులో మహిళా సైకో వీరంగం.. కత్తి చూపిస్తూ హల్చల్