న్యూఢిల్లీ, జూన్ 25: రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించలేని విధంగా ఉంటే.. క్యాన్సర్బారిన పడే అవకాశముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉందని భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తాజాగా తెలిపింది.
డయాబెటిస్ పట్ల మహిళలు జాగ్రత్తగా ఉండాలని, దీనిని నియంత్రించే చర్యలు సరిగా చేపట్టకపోతే ఆరోగ్యం ప్రమాదంలో పడటం ఖాయమని ఐసీఎంఆర్ నివేదిక పేర్కొన్నది. దీని ప్రకారం, క్యాన్సర్ కణాల వృద్ధికి డయాబెటిస్ కారణమవుతున్నది. అధిక బరువు, శరీరంలో వాపులు, ఇన్సులిన్ నిరోధకత (ఇన్సులిన్ ఉత్పత్తి అవుతున్నా క్రియాశీలంగా లేకపోవటం) మొదలైనవి గర్భాశయ క్యాన్సర్కు దారితీస్తాయి.
దీనిబారిన పడకుండా ఉండాలంటే ఆహారపు అలవాట్లు మార్చుకోవాల్సి ఉంటుంది. శారీరక బరువు, డయాబెటిస్ను అదుపులో ఉంచుకునేందుకు రోజూ వ్యాయామాన్ని ఎంచుకోవాలి. రాత్రిళ్లు ఎక్కువసేపు మెలకువగా ఉంటూ.. కంప్యూటర్, స్మార్ట్ఫోన్లతో గడపటం మానుకోవాలి.