Engineer Rashid : ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీచేసి గెలిచిన ఇంజినీర్ రషీద్ (Engineer Rashid) అలియాస్ షేక్ అబ్దుల్ రషీద్ (Sheikh Abdul Rashid).. ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసేందుకు మార్గం సుగమం అయ్యింది. జమ్ముకశ్మీర్ టెర్రర్ ఫండింగ్ కేసులో అరెస్టై ప్రస్తుతం జైల్లో ఉన్న రషీద్.. ఎంపీగా ప్రమాణం స్వీకారం చేసేందుకు ఢిల్లీలోని పటియాలా హౌజ్ కోర్టు అనుమతించింది.
ఎంపీగా గెలిచిన రషీద్ తనకు ప్రమాణ స్వీకారం కోసం మధ్యంతర బెయిల్గానీ, కస్టడీ పెరోల్గానీ మంజూరు చేయాలని కోర్టును అభ్యర్థించారు. ఆ పిటిషన్పై జూన్ 22న విచారణ జరిపిన పటియాలా కోర్టు.. తదుపరి విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది. రషీద్ పిటిషన్పై స్పందన తెలియజేయాలని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ను ఆదేశించింది. రషీద్కు కస్టడీ పెరోల్ ఇచ్చేందుకు NIA అంగీకారం తెలుపడంతో.. ఈ నెల 5న రెండు గంటల కస్టడీ పెరోల్ మంజూరు చేసింది.
ఈ లోక్సభ ఎన్నికల్లో జమ్ముకశ్మీర్లోని బారాముల్లా లోక్సభ స్థానం నుంచి ఇంజినీర్ రషీద్ ఇండిపెండెంట్గా పోటీ చేశారు. అదే స్థానం నుంచి జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా నేషనల్ కాన్ఫరెన్స్ తరఫున బరిలో దిగారు. అయితే అనూహ్యంగా ఇంజినీర్ రషీద్.. ఒమర్ అబ్దుల్లాపై రెండు లక్షల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలిచారు. అయితే జైల్లో ఉన్న కారణంగా మిగతా ఎంపీలతోపాటు ఎంపీగా ప్రమాణస్వీకారం చేయలేకపోయారు.
కాగా, ఇంజినీర్ రషీద్ 2017లో జమ్ముకశ్మీర్ టెర్రర్ ఫండింగ్ కేసులో అరెస్టయ్యారు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) ఆయనను అదుపులోకి తీసుకుంది. అప్పటి నుంచి ఆయన విచారణను ఎదుర్కొంటూ జైల్లో ఉంటున్నారు. దాంతో ఎంపీగా గెలిచినా ఇప్పటికీ ప్రమాణస్వీకారం చేయలేకపోయారు. ఇప్పుడు కోర్టు కస్టడీ పెరోల్ మంజూరు చేయడంతో ఈ నెల 5న ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు.